వడ్డీ రేటు పెంచేసిన బ్యాంకు.. పెరగనున్న ఈఎంఐల భారం
01 June 2022, 12:00 IST
- పంజాబ్ నేషనల్ బ్యాంకు 0.15 శాతం మేర వడ్డీ రేట్లు పెంచేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలోని ఓ బ్రాంచ్
న్యూఢిల్లీ, జూన్ 1: కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని షెడ్యూల్డు బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వడ్డీ రేట్లను(ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. అన్ని రుణ వ్యవధులకు ఇది వర్తిస్తుంది. దీంతో రుణగ్రహీతలకు ఈమేరకు ఈఎంఐ భారం పెరగనుంది.
కొత్త వడ్డీ రేట్లు జూన్ 1 నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెబీకి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
మే నెలలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు 0.40 శాతం పెంచిన మీదట పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం వసూలు చేస్తున్న 7.25 శాతం వడ్డీ రేటుకు బదులు 7.40 శాతం వడ్డీ వసూలు చేయనుంది. దాదాపు అన్ని రకాల లోన్లు ఏడాది-ఎంసీఎల్ఆర్ రేటుతో ప్రభావితమవుతూ ఉంటాయి.
ఈనేపథ్యంలో ఒకనెల ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు పెరిగి 6.80 శాతంగా, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.90 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ 7.10 శాతంగా ఉంటుంది.
ఇదే సమయంలో మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 7.70 శాతానికి పెరిగింది.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం పెరగనుంది.