Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు తీర్పు
12 September 2022, 9:52 IST
Gyanvapi mosque case: జ్ఞాన వాపి మసీదు లో పూజల నిర్వహణ పై నేడు తీర్పు వెలువరించనున్న వారణాసి జిల్లా కోర్టు
వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు
వారణాసి, సెప్టెంబర్ 12: జ్ఞాన్వాపీ మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేష్ గత నెలలో ఈ కేసు విచారణ సందర్భంగా ఉత్తర్వులను సెప్టెంబర్ 12వ తేదీకి రిజర్వ్ చేశారు.
జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ హిందూ మహిళలు చేసిన అభ్యర్ధనకు సంబంధించి ఈ కేసులో విచారణ జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జిల్లా కోర్టు ఆదేశాలకు ఒక రోజు ముందు ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేసి నిషేధాజ్ఞలు (సెక్షన్ 144) విధించారు.
కాశీ విశ్వనాథ్లోని శృంగార్ గౌరీ స్థలానికి పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు చేసిన విజ్ఞప్తి మేరకు శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
‘వారణాసి కోర్టు కీలకమైన అంశంపై తీర్పును వెలువరించనుంది. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. విభిన్న వర్గాలు కలిసి నివసించే ప్రాంతాల్లో బలగాలను నియమించాం. పెట్రోలింగ్ కొనసాగుతోంది. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా మేం మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం..’ అని పోలీస్ కమిషనర్ సతీష్ గణేష్ చెప్పారు.
కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపీ మసీదు సముదాయంలోని శృంగార్ గౌరీ స్థలానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో స్థానిక వారణాసి కోర్టు మేలో ఈ సముదాయంలో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. అధికారులు మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు.
వీడియోగ్రఫీ సర్వే తర్వాత మసీదు సముదాయంలో శివలింగాన్ని పోలిన నిర్మాణం కనిపించిందని హిందూ పక్షం వాదనలు చేసింది. ఇది శివలింగం కాదని ఫౌంటెన్ అని మసీదు కమిటీ వాదించింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు లోపల హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని చేసిన దావాకు తగిన ఆధారాలను సేకరించేందుకు మసీదు సముదాయాన్ని తనిఖీ చేయాలని, వీడియో ఆధారిత సర్వే చేయాలని తొలుత సివిల్ జడ్జి ఆదేశాలు జారీచేశారు.
సివిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు మేనేజ్మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ కారణంగా ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
మే 20న సుప్రీంకోర్టు ఈ కేసును సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) నుండి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. సమస్య ‘క్లిష్టత, సున్నితత్వాన్ని’ పరిగణనలోకి తీసుకుంటున్నామని, 25 నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ జ్యుడీషియల్ అధికారి ఈ కేసు విచారించాలని సూచించింది. నమాజ్ లేదా మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి మసీదులోకి ప్రవేశించే ముస్లింలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ధర్మాసనం పేర్కొంది.
శివలింగం కనిపించిన ప్రాంతాన్ని రక్షించడానికి, నమాజ్ కోసం ముస్లింలకు ప్రవేశం కల్పించడానికి వీలుగా ఏర్పాట్లను ఈ వ్యాజ్యంలో నిర్ణయం తీసుకునే వరకు కొనసాగించాలని, వాదప్రతివాదులు చట్టపరమైన పరిష్కారాలను అనుసరించేందుకు వీలుగా, నిర్ణయం వెలువడిన ఎనిమిది వారాల వరకు ఈ ఏర్పాట్లు కొనసాగించాలని మే 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు ఆదేశించింది.
కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ విన్నపం మేరకు జిల్లా జడ్జి జ్ఞాన్వాపి-కాశీ విశ్వనాథ్లో సివిల్ దావా యోగ్యతను వేగంగా నిర్ణయించాలని సుప్రీం కోర్టు సూచించింది.