Gautam Adani | వద్దంటే కోట్లు.. ఎలోన్ మస్క్ సరసన అదానీ.. ఎంత సంపాదించారో చూడండి!
02 April 2022, 18:09 IST
- Gautam Adani సంపాదనకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా ఈ కుబేరుడు మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరులు ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ల సరసన నిలిచారు.
సెంటీబిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ
ముంబై: భారత కుబేరుడు గౌతమ్ అదానీ ఈ ఏడాది తన సంపదకు మరో 2400 కోట్ల డాలర్లను జత చేసుకున్నారు. ప్రపంచంలో మరెవరూ ఈ స్థాయిలో సంపాదించలేదు. దీంతో ఆయన సెంటిబిలియనీర్స్ క్లబ్లో చేరారు. అంటే 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.5 లక్షల కోట్లు) మార్క్ అందుకున్నారు. మరోవైపు మరో భారత కుబేరుడు ముకేశ్ అంబానీ 99 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్లో అంబానీ కూడా 100 బిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సందప కాస్త తగ్గింది.
అదానీ సంపద మొత్తం గత రెండేళ్లలోదే కావడం గమనార్హం. కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను తలకిందులు చేస్తే.. అదానీ ఆస్తులు మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. దేశం గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుండటం, ఆయన సంస్థల్లో ఫ్రాన్స్కు చెందిన రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో అదానీ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. 2020 నుంచి అదానీకి చెందిన సంస్థల షేర్లు కొన్ని 1000 శాతం వరకూ పెరగడం విశేషం. 2021లోనే అదానీ సంపద 42.7 బిలియన్ డార్లు పెరిగింది.
ఈ 100 బిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆయన 1999లోనే ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2017లో ఈ 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ 2020లో ఈ క్లబ్లో చేరగా.. ప్రస్తుతం ఆయన సంపద విలువ 273 బిలియన్ డాలర్లుగా ఉంది.
టాపిక్