Crime: టీ ఇచ్చిన కోడలు.. టిఫిన్ పెట్టలేదని మామ కాల్పులు
15 April 2022, 13:44 IST
మహారాష్ట్రలో దారుణం జరిగింది. టిఫిన్ పెట్టలేదన్న కారణంతో కోడలిపై 76 ఏళ్ల వృద్ధుడు(మామ) కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోడలిపై వృద్ధుడు కాల్పులు
మామకు టీ ఇచ్చింది కోడలు.. టిఫిన్ ఇవ్వలేదు.. ఇంత చిన్న విషయానికే ఆ వృద్ధుడు ఏకంగా గన్ కు పని చెప్పాడు. కోడలిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో గురువారం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు కోడలు టీ అందించింది. అయితే టిఫిన్ ఇవ్వకపోవటంపై ఆగ్రహానికి గురయ్యాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కోడలి(42) పొట్టలోకి బులెట్ దూసుకెళ్లింది. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతోంది.
నిందితుడిపై ఐపీసీ 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాబోడి పోలీసు స్టేషన్ సీఐ సంతోష్ ఘట్కేర్ పేర్కొన్నారు. ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనకు క్షణికావేశం కారణమా..? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తామని చెప్పారు.
టాపిక్