ఓటర్ లిస్ట్తో ఆధార్ నెంబర్ లింక్… ఎప్పటి నుంచి అంటే..
19 June 2022, 7:36 IST
- Aadhaar Voter Card Link: 2022 ఆగస్టు 1 నుంచి ఓటర్ల నమోదు (సవరణ) కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వాళ్లంతా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీ నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఓటర్ కార్డుతో ఆధార్ లింక్(Representational photo)
Aadhaar Number With Electoral Roll: గతేడాది డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021లోని నిబంధనలకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటర్ జాబితాలో మరింత పారదర్శకత దిశగా ఆధార్ ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయనుంది.ఇందుకు అనుమతి ఇస్తూ కేంద్రం కొత్త రూల్స్ ను రూపొందించింది. కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ఓటర్ లిస్టులోపేర్లు ఉన్న వారంతా కూడా వచ్చే 2023, ఏప్రిల్ 1 వ తేదీ నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలి.
కొత్తగా నాలుగు సార్లు….
జూన్ 17న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో భారత ఎన్నికల కమిషన్తో సంప్రదింపుల తర్వాత సవరణలు చేస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై మంత్రి కిరణ్ రిజిజు ట్విట్ట్ర్లో పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్ డేటాతో ఆధార్ను లింక్ చేయడమే కాకుండా, కొత్త ఓటర్లను సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని వెల్లడించారు. క్యాలెండర్ సంవత్సరంలో జనవరి 1 లేదా ఏప్రిల్ 1, జూలై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు వెంటనే ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగు అర్హత తేదీలు ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాయని రిజీజు తన ట్వీట్లో పేర్కొన్నారు. 6 బీ' ప్రత్యేక ఫామ్ తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
ఆధార్ లేకపోతే...
ఇక ఆధార్ కార్డు లేని వారి కోసం ప్రత్యామ్నాయం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వీరు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే జాబ్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ జత చేయవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేక కాలమ్ ను పొందుపరిచారు. వైఫ్(భార్య) అనే పదానికి బదులు స్పౌస్(జీవిత భాగస్వామి) పదాన్ని పెట్టారు. జెండర్ తెలియజేసే చోట న్యూట్రల్ అనే పదాన్ని కొత్తగా చేర్చారు. ఇక సైనిక కుటుంబ సభ్యుల ఓట్లను సర్వీస్ ఓట్లుగా పరిగణించనున్నారు.