CAA rules: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే సీఏఏ నిబంధనలు ప్రకటించే అవకాశం
28 February 2024, 13:33 IST
- CAA rules: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే పౌరసత్వ (సవరణ) చట్టానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Citizenship (Amendment) Act : పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో రెండు వారాల్లో నోటిఫై చేయనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమల్లోకి రాకముందే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సీఏఏ ప్రకారం.. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ అర్హతను నిరూపించుకోవడానికి అందించాల్సిన అవసరమైన సాక్ష్యాలను ఈ నిబంధనలు వివరిస్తాయి.
2019 లో పార్లమెంట్ ఆమోదం
పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) 2019 డిసెంబర్ 11 న పార్లమెంటు ఆమోదించింది. అదే సంవత్సరం డిసెంబర్ 12 న నోటిఫై చేసింది. అయితే నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో వివాదాస్పద చట్టం అమలుకు నోచుకోలేదు. 2014 డిసెంబర్ 31కి ముందు పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సీఏఏ సవరించింది.
వివాదాస్పద చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇది ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని, భారత రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలను బలహీనపరుస్తుందని విమర్శకులు వాదించారు. మరోవైపు, పొరుగు దేశాల నుంచి హింసకు గురైన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించిన మానవతా చర్యగా ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే, మతపరమైన హింసకు సంబంధించిన ఆధారాలను ప్రభుత్వ కోరబోదని తెలుస్తోంది.
అది కాంగ్రెస్ హామీ: అమిత్ షా
లోక్ సభ ఎన్నికలకు ముందే సీఏఏ (CAA) నిబంధనలను నోటిఫై చేసి అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈటీ-నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (జీబీఎస్)లో అమిత్ షా మాట్లాడుతూ ‘‘సీఏఏ ప్రస్తుతం అవసరమైన చట్టం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందే దీనిని నోటిఫై చేస్తాం. దాని గురించి ఎటువంటి గందరగోళం ఉండకూడదు’’ అన్నారు. ‘‘సీఏఏ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ. దేశం విడిపోయినప్పుడు, ఆ దేశాల్లో మైనారిటీలు హింసకు గురైనప్పుడు, శరణార్థులను భారతదేశంలో స్వాగతిస్తున్నామని, వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఆ తరువాత వారు వెనక్కి తగ్గారు’’ అని అమిత్ షా విమర్శించారు.