టాటా గూటికి ఎయిర్ ఇండియా.. అప్పగింత ప్రక్రియ పూర్తి
27 January 2022, 19:41 IST
- Air India Tata takeover | టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియా అప్పగింత ప్రక్రియ గురువారంతో అధికారికంగా ముగిసింది. శుక్రవారం నుంచి టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ విషయంపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ హర్షం వ్యక్తం చేశారు.
టాటా చేతికి ఎయిర్ ఇండియా.. అధికార ప్రక్రియ పూర్తి
Air India Tata news | టాటా గ్రూప్ గూటికి ఎయిర్ ఇండియా అధికారికంగా చేరిపోయింది. విమాన సంస్థను టాటా గ్రూప్నకు అప్పగించే ప్రక్రియ అధికారికంగా గురువారంతో ముగిసింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఎం) కార్యదర్శి తుహిన్ పాండే వెల్లడించారు.
ఈ వారం ప్రారంభంలో ఎయిర్లైన్ ముగింపు బ్యాలెన్స్ షీట్ను ఖరారు చేసి, సమీక్ష కోసం టాటాలకు ఎయిర్ ఇండియా బోర్డు పంపించింది. గురువారం ఉదయం ఎయిర్ ఇండియా బోర్డు చివరిసారిగా సమావేశమైంది. భేటీలో బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. ఫలితంగా.. శుక్రవారం నుంచి టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలు సాగనున్నాయి.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో 100శాతం వాటాను అమ్మేందుకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18వేల కోట్లకు బిడ్డింగ్ వేసిన టాటా గ్రూప్.. గతేడాగి అక్టోబర్లో ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. ఎయిర్ ఇండియాతో కలిపి విమానయాన రంగంలో దాదాపు 27శాతం మార్కెట్ వాటాను కలిగిన సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది. విస్తారాలో 51శాతం, ఎయిర్ ఆసియాలో 84శాతం వాటా.. టాటా సొంతం.
సుమారు 90ఏళ్ల క్రితం జేఆర్డీ టాటా.. టాటా ఎయిర్ సర్వీసెస్ను ప్రారంభించారు. 1953లో టాటా ఎయిర్ సర్వీసెస్ను ఆధీనంలోకి తీసుకున్న కేంద్రం.. దానికి ఎయిర్ ఇండియా అని నామకరణం చేసింది. ఆ తర్వాత క్రమంగా అప్పుల ఊబిలో సంస్థ కూరుకుపోయింది. చివరికి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తప్పలేదు. ఫలితంగా ఇన్ని దశాబ్దాల తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్లో చేరింది.
'భవిష్యత్తు కోసం స్వాగతం'
ఎయిర్ ఇండియాకు సంబంధించిన ప్రక్రియ పూర్తవడంపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ హర్షం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఎయిర్ఇండియాను ప్రపంచస్థాయి ఎయిర్లైన్స్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఉద్యోగులకు స్వాగతం పలుకుతూ సందేశం పంపారు.
"టాటా కుటుంబంలోకి ఎయిర్ ఇండియాను తిరిగి స్వాగతించడం ఎంతో గర్వంగా ఉంది. నాతో పాటు చాలా మంది ఎయిర్ ఇండియా ఘనతల గురించి చదువుకున్నారు. ఈ జ్ఞాపకాలు మధురమైనవి. కానీ ఇది ముందుకు వెళ్లాల్సిన సమయం. ఇవాళ కొత్త అధ్యయనం ప్రారంభమైంది. యావత్ దేశం మనవైపు చూస్తోంది. మనమందరం(ఉద్యోగులు) కలిసి ఏలాంటి అద్భుతాలు సాధిస్తామని ప్రజలు ఎదురుచూస్తున్నారు," అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఎయిర్ఇండియా అప్పగింతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో గురువారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఎయిర్ ఇండియా ప్రస్థానంపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.