టీవీ నటిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఎన్కౌంటర్
27 May 2022, 19:05 IST
కశ్మీర్లో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను శుక్రవారం భద్రతాదళాలు హతమార్చాయి. వారిలో ఇద్దరు కశ్మీర్ టీవీ నటిపై కాల్పులు జరిపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు.
కశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్(ఫైల్ ఫొటో)
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య రెండు వేర్వేరు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు షాహీద్ ముస్తాఖ్ భట్, ఫర్హాన్ హబీబ్ గా గుర్తించారు. వారు కశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్పై కాల్పులు జరిపి చంపేసిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
కశ్మీర్లో పెరిగిన ఉగ్ర కార్యకలాపాలు
జమ్మూకశ్మీర్లో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. వారం క్రితం కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను బుద్గాం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చిచంపేశారు. టీవీ నటి అమ్రీన్పై బుధవారం కాల్పులు జరపగా, ఆమె మృతి చెందారు. ఆమె 10 ఏళ్ల మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. గత మూడు రోజుల్లో నాలుగు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వారిలో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు, ఏడుగురు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం శ్రీనగర్లో, పుల్వామా జిల్లాలో రెండు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఎన్కౌంటర్లలో నలుగురు టెర్రరిస్ట్లు హతమయ్యారు. శ్రీనగర్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టగా, టీవీ నటి అమ్రీన్ భట్పై కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు వలలో పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు షాహీద్ ముస్తాఖ్ భట్, ఫర్హాన్ హబీబ్ హతమయ్యారని, వారిద్దరూ ఇటీవలే లష్కరే తోయిబాలో చేరారని వివరించారు.
టాపిక్