Wings India 2022 | హైదరాబాద్ గగనపు వీధుల్లో వీనుల విందు.. ఏసియాలోనే అతిపెద్దది!
24 March 2022, 20:25 IST
- హైదరాబాద్, బేగంపేట విమానాశ్రయంలో అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శన ప్రారంభమైంది.. ఈ షోకు చివరి రెండు రోజులు ప్రజలకు అనుమతి ఉంటుంది.
Asia's largest civil aviation - Wings India 2022
పౌర విమానయాన రంగంలోనే అతి పెద్ద ప్రదర్శన 'వింగ్స్ ఇండియా 2022' ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయంలో ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత ఇండస్ట్రీ సమాఖ్య - ఫిక్కీ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. 'ఇండియా @ 75- విమానయాన రంగంలో కొత్త అవధులు' అనే ఇతివృత్తంతో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 27 వరకు జరుగుతుంది.
మొదటి రెండు రోజులు వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు జరుగుతుండగా, చివరి రెండు రోజులు అనగా మార్చి 26, 27 తేదీల్లో ప్రజల సందర్శనార్థం ఈ షో ఉంటుంది. ఈ ప్రదర్శనలో వివిధ కార్యక్రమాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ ఎగ్జిబిషన్లో ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ తయారీదారులు, ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్స్, ఎయిర్క్రాఫ్ట్ మెషినరీ, ఎక్విప్మెంట్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, డ్రోన్స్, స్కిల్ డెవలప్మెంట్, స్పేస్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్, ఎయిర్లైన్ సర్వీసెస్ - కార్గో తదితరులు పాల్గొంటారు. వీరంతా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.
మొత్తంగా ఈ ఎగ్జిబిషన్లో భారత్ సహా 15 దేశాలకు చెందిన 125కు పైగా అంతర్జాతీయ, దేశీయ ఎగ్జిబిటర్లు. హాస్పిటాలిటీ ప్రతినిధులు, ఈ రంగంలో నిపుణులు పాల్గొంటున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఏవియేషన్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయానయాన శాఖ మంత్రులు, ఏవియేషన్ రంగంలోని దిగ్గజాలను ఒకచోట కలుపుతుంది. అందుకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇస్తుండటం గొప్ప విశేషం.
ఈవెంట్ లోని వివిధ ఆకర్షణలలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన సారంగ్ బృందం హెలికాప్టర్ ఏరోబాటిక్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఆకాశంపై అందాలు విరబూసేలా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల విన్యాసాలు హైదరాబాద్ లోని వీక్షకులకు వీనుల విందును కలిగించనున్నాయి.