Crispy Prawns Fry: క్రిస్పీ రొయ్యల వేపుడు రెసిపీ, చూస్తేనే నోరూరిపోతుంది, తింటే ఆ రుచి మామూలుగా ఉండదు
06 February 2024, 16:00 IST
- Crispy Prawns Fry: క్రిస్పీగా కరకరలాడేలా రొయ్యల వేపుడు చేసి చూడండి. పిల్లలకు చాలా నచ్చుతుంది. పెద్దలు కూడా ఈ క్రిస్పీ రొయ్యల వేపుడు ఇష్టపడతారు.
క్రిస్పీ రొయ్యల వేపుడు రెసిపీ
Crispy Prawns Fry: రొయ్యల వేపుడు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక ఎదురుగా ఉంటే తినకుండా ఎవరూ ఆగలేరు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వారానికి ఒకటి నుంచి రెండుసార్లు రొయ్యలు తినమని వైద్యులు చెబుతూ ఉంటారు. రొయ్యలు తినేవారిలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలు రొయ్యల కూరను ఇష్టపడకపోతే ఒకసారి క్రిస్పీగా రొయ్యల వేపుడు తయారుచేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.
క్రిస్పీ రొయ్యల వేపుడు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు పెద్దవి - అరకిలో
సోయా సాస్ - రెండు స్పూన్లు
వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
అల్లం పేస్టు - ఒక స్పూను
గుడ్లు - రెండు
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
వెల్లుల్లి తరుగు - అర స్పూను
పచ్చిమిర్చి - ఒకటి
స్ప్రింగ్ ఆనియన్ తరుగు - రెండు స్పూన్లు
నీరు - తగినంత
టమాటో కెచప్ - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
క్రిస్పీ రొయ్యల వేపుడు రెసిపీ
1. రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. చిన్న రొయ్యలను తీసుకుంటే వేపుడు సరిగా రాదు, కాబట్టి టైగర్ ఫ్రాన్స్ వంటివి తీసుకుంటే క్రిస్పీగా రొయ్యల వేపుడు టేస్టీగా వస్తుంది.
2. ఈ రొయ్యల్లో సోయాసాస్, వెల్లుల్లి, అల్లం పేస్టు, కోడిగుడ్లు వేసి బాగా కలపాలి.
3. పైన కార్న్ ఫ్లోర్ ని కూడా వేసి కలుపుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
5. అందులో ఈ రొయ్యలను వేసి డీప్ ఫ్రై చేయాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద సాధారణ కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
7. అందులో వెల్లుల్లి తరుగును, స్ప్రింగ్ ఆనియన్ తరుగును వేసి వేయించాలి.
8. అలాగే సోయా సాస్, టమోటా కెచప్ వేసి వేయించాలి.
9. ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
10. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా టాస్ చేయాలి. అంతే క్రిస్పీ రొయ్యల వేపుడు రెడీ అయినట్టే.
11. ఇది వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది.
12. పైన కాస్త కొత్తిమీర తరుగును చల్లుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి ఇది తయారుచేసి చూడండి. మీకే ఎంతో నచ్చుతుంది.
రొయ్యలు తినడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి12 పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్, బలహీనత, తీవ్రమైన అలసట వంటివి రావచ్చు. కాబట్టి రొయ్యలను తరచూ తినడం అలవాటు చేసుకోవాలి. రొయ్యల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఇది పోషకాహారం కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రొయ్యలను తరచూ తింటే మంచిది. దీనిలో సెలీనియం ఉంటుంది. రొయ్యల్లో ఉండే సెలెనియం శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రొయ్యలను వారానికి కనీసం ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లల చేత తినిపించేందుకు ప్రయత్నించండి.
టాపిక్