Vijay Devarakonda: నార్త్-సౌత్ హద్దులు తొలుగుతాయి.. రౌడీ హీరో అదిరేపోయే రిప్లయి
23 July 2022, 8:10 IST
- విజయ్ దేవరకొండ నటించిన లైగర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్తో పాటు ముంబయిలోనూ జరిగింది. బీటౌన్ మీడియాతో మాట్లాడిన మన రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజయ్ దేవరకొండ
లైగర్ సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. గురువారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్యా పాండే, పూరి జగన్నాథ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాకుండా ముంబయిలో జరిగిన వేడుకకు రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమాకు ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన చిత్రబృందం ఆసక్తికర విషయాలను పంచుకుంది. రౌడీ హీరో తనదైన శైలిలో సమాధానమిస్తూ బీటౌన్ మీడియా అభిమానాన్ని చూరగొన్నాడు. దక్షిణాది-ఉత్తర భారత సినిమాలనే విభేదాలు త్వరలోనే తొలగిపోతాయని విజయ్ ఆకాంక్షించాడు.
"నార్త్, సౌత్ సినిమా అనే బేధం ఎక్కువ రోజులను ఉండదని నేననుకుంటున్నా. మొత్తం కలిపి ఇండియన్ సినిమా అనే భావన త్వరలోనే వస్తుందని భావిస్తున్నా. అలాగే మా అందరినీ ఇండియన్ యాక్టర్లు అని అంటారు." అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. కోలీవుడ్ హీరో ధనుష్ హాలీవుడ్ అరంగేట్రం గురించి మాట్లాడుతూ.. నటులకు ప్రాంతీయ గుర్తింపులను జోడించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రతిభ, సృజనాత్మకతకు సరిహద్దులు లేవని తెలిపాడు. చాలా మంది సౌత్ యాక్టర్లు, దర్శకులు బాలీవుడ్లో వర్క్ చేశారని, అలాగే ఉత్తరాధి భామలు దక్షిణాదిన అగ్ర శ్రేణి హీరోయిన్లుగా వెలుగొందారని స్పష్టం చేశారు.
"దక్షిణాదికి చెందిన సాంకేతిక నిపుణులు ఉత్తరాదిన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అలాగే ఉత్తరాది హీరోయిన్లు దక్షిణాదిన నటించారు. అనిల్ కపూర్ సౌత్ సినిమాతోనే అరంగేట్రం చేశారు. శ్రీదేవి సౌత్ ఇండియాకు చెందినవారు. ఇది కేవలం ఇప్పుడు మొదలైంది కాదు. కాకపోతే ఇప్పుడు దేశం మొత్తం చూసే సినిమాలు చేస్తున్నాం" అని విజయ్ దేవరకొండ తెలిపారు.
పూరీ కనెక్ట్స్తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూరీ జగన్నాథే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.