Suriya | సూర్య దంపతులపై FIR నమోదు చేయాలని కోర్టు ఆదేశం.. ఎందుకో తెలుసా?
05 May 2022, 20:11 IST
- తమిళనాడుకు చెందిన వన్నియర్ల వర్గం జైభీమ్ హీరో సూర్య, నిర్మాతలపై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సినిమాలో తమ సామాజిక వర్గాన్ని అవమానించారంటూ కేసు వేశారు. దీంతో కోర్టు విచారణ చేపట్టింది.
జైభీమ్
సూర్య హీరోగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైభీమ్. ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అలాగే ఓ వర్గం నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. తమిళనాడుకు చెందిన వన్నియర్లు అనే కమ్యునిటీని అవమానించారంటూ వివాదం చెలరేగింది. సినిమా విడుదల సమయంలో పీఎంకే నేత అన్బుణి రామదాసు ఆరోపించగా.. అదే సామాజిక వర్గానికి చెందిన రుద్ర వన్నియర్ సేన గతేడాది నవంబరులో కోర్టులో పిటిషన్ వేశాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పిటిషన్లో పేర్కొంది.
గురువారం పిటిషన్ను విచారించిన సైదా పేట్ కోర్టు సూర్యతో పాటు ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సతీమణి జ్యోతిక, దర్శకుడు జ్ఞాన్వేల్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
వన్నియర్లు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గత నవంబరులోనే ఆందోళన చేపట్టారు. కోర్టులో కేసు వేసి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని పిలుపునిచ్చారు. తాజా ఆదేశంతో పోలీసులు ఇందులో హీరోగా నటించి సూర్య, నిర్మాత జ్యోతికపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.
జస్టిస్ చంద్రూ కెరీర్లో కీలకంగా నిలిచిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరెకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్రైమ్ వీడియోలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2021 నవంబరు 2 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్