Liger Issue: పూరి జగన్నాథ్ వర్సెస్ లైగర్ ఎగ్జిబిటర్స్ - మధ్యలో చిరంజీవి పేరు ఎందుకొచ్చింది?
16 May 2023, 12:25 IST
Liger Issue: లైగర్ నష్టాలపై పూరి జగన్నాథ్, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో కొత్తగా చిరంజీవి పేరు వినిపించడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
లైగర్ ఎగ్జిబిటర్ల దీక్ష
Liger Issue: లైగర్ నష్టాలను పూరి జగన్నాథ్ భరించాల్సిందేనని ఎగ్జిబిటర్లు, లీజర్స్ ఇటీవల నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ఆవరణలో గత నాలుగు రోజులుగా దీక్షను కొనసాగిస్తోన్నారు. ఎగ్జిబిటర్ల దీక్షకు ఏషియన్ ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ మద్ధుతు ప్రకటించారు.
ఏడాది కాలంగా లైగర్ నష్టాలపై తాము పోరాటం చేస్తోన్నట్లు ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు. తాము నష్టపోయిన మొత్తాలను పూరి జగన్నాథ్ భరించాల్సిందేనని పట్టుపడుతోన్నారు. ఈ వివాదంపై విజయ్ దేవరకొండ మౌనంగా ఉండటం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.
అతడు కూడా స్పందించాల్సిందేనని చెబుతోన్నారు. అయితే ఈ వివాదంలో అనుకోకుండా చిరంజీవి పేరు వినిపించడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆచార్య సినిమాతో తాము నష్టపోతే దాదాపు 12 కోట్లను చిరంజీవి వెనక్కి ఇచ్చారని ఎగ్జిబిటర్లు చెబుతోన్నారు. చిరంజీవి వెనక్కి ఇచ్చిన డబ్బులను ఎగ్జిబిటర్ వరంగల్ శ్రీను లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టాడని అంటోన్నారు.
కానీ లైగర్ కూడా డిజాస్టర్గా మిగలడంతో తాము భారీగా నష్టపోయామని ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు. తన నెక్స్ట్ సినిమా ప్రారంభమయ్యేలోపు నష్టపోయిన మొత్తాల్లో కొంత తిరిగి ఇస్తానని పూరి మాటిచ్చాడని, కానీ ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడని అంటోన్నారు.
ఆచార్యకు నష్టాలు వస్తే చిరంజీవి 12 కోట్లు తిరిగి ఇచ్చాడని, పూరి జగన్నాథ్ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడని ప్రశ్నిస్తోన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా గత ఏడాది ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్గా మిగిలింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.