Priyanka Chopra | కూతురి గురించి ప్రియాంక ఎమోషనల్ పోస్ట్...100 రోజుల తర్వాతే ఇంటికొచ్చిందట...
09 May 2022, 9:35 IST
సరోగసి విధానంలో ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. తమకు కూతురు జన్మించినట్లు జనవరిలో ప్రియంకా, నిక్ జోనస్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా కూతురి ఫొటోను తొలిసారి అభిమానులతో పంచుకున్నది ప్రియాంక చోప్రా. తన ముద్దుల తనయ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ప్రియాంక చోప్రా
మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురితో కలిసి దిగిన ఫొటోను ప్రియాంక చోప్రా అభిమానులతో పంచుకున్నది. ఈ ఏడాది ఆరంభంలో సరోగసీ విధానంలో తమకుకూతురు జన్మించినట్లు ప్రియాంక,నిక్ జోనస్ దంపతులు ప్రకటించారు. ఈ చిన్నారికి మాల్టీ మేరీ చోప్రా జోనస్ అనే పేరు పెట్టారు. అయితే కూతురి గురించి ఇన్నాళ్లు ఎలాంటి సమాచారం, ఫొటోలు బయటకురాకుండా ప్రియాంక చోప్రా జాగ్రత్తపడింది.
ఆదివారం మదర్స్ డే సందర్భంగా కూతురిని గుండెలకు హత్తుకున్న ఫొటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో భార్య, కూతురిని చూసి మురిసిపోతూ నిక్ జోనస్ కనిపిస్తున్నారు. వందకు పైగా రోజుల తర్వాత కూతురు తన ఇంటిలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా ఈ ఫొటోను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. తొమ్మిది నెలల కంటే ముందుగానే జన్మించడంలో ఇన్నాళ్లు ఎన్ఐసీయూలో కూతురిని ఉంచాల్సివచ్చిందని వెల్లడించింది. ‘గత కొన్నాళ్లుగా రోలర్కోస్టర్ రైడ్గా మా జీవితం సాగిపోయింది.
ఇన్నాళ్లు ఊపిరి బిగపట్టుకొని గడిపాం. జీవితగమనంలో అందరి ప్రయాణం ఒకేలా ఉండదు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడటానికి కాస్త భరోసా, నమ్మకం అవసరం. గత కొన్ని నెలలగా కష్టాలతో మా జర్నీ సాగింది. కానీ లోతుగా ఆలోచిస్తే అందులోని ప్రతి క్షణం ఎంత విలువైనదో అర్థం చేసుకున్నాం. చివరికి వందకుపైగా రోజుల తర్వాత మాల్టీ ఇంటికి చేరుకోవడంతో మా ఆనందం రెట్టింపైంది. మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అని ప్రియాంక చోప్రా ఎమోషనల్ గా ఈ పోస్ట్ లో పేర్కొన్నది. తమ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కూతురి ముఖం కనిపించకుండా లవ్ ఎమోజీని జోడించింది ప్రియాంక చోప్రా.