Yatra 2: యాత్ర 2 చిత్రంలో పవన్ కల్యాణ్తో పాటు ఆ ఇద్దరి పాత్రలు ఉండవా?
14 January 2024, 20:48 IST
Yatra 2: యాత్ర 2 సినిమాలో మూడు కీలకమైన పాత్రలు ఉండవని సమాచారం బయటికి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఆ వివరాలివే..
యాత్ర 2 పోస్టర్
Yatra 2: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రానున్న ‘యాత్ర 2’ చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలు, 2019 ఎన్నికల ముందు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రధాన అంశాలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించారు. మహీ వీ రాఘవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. జగన్ తండ్రి, దివంగత మాజీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర మూవీ.. 2019 ఎన్నికలకు ముందు వచ్చింది. ఆ చిత్రంలో వైఎస్ఆర్గా మలయాళ స్టార్ మమ్మూట్టి నటించారు. దీనికి సీక్వెల్గా రూపొందిన యాత్ర 2.. ఈ ఏడాది 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజ్ కానుంది.
అయితే, యాత్ర 2 సినిమాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్, వైఎస్ జగన్ సోదరి షర్మిళ పాత్రలు ఉండవని సమాచారం చక్కర్లు కొడుతోంది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ముగ్గురు క్రియాశీలకంగానే ఉన్నా.. యాత్ర 2లో మాత్రం ఆ క్యారెక్టర్లు ఉండవని ఇప్పటికే మూవీ టీమ్ కూడా సంకేతాలు ఇచ్చింది. ఇటీవలే యాత్ర 2 టీజర్ రిలీజ్ కాగా.. ఈ ముగ్గురి పాత్రలు లేవు.
యాత్ర 2 సినిమా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 నుంచి 2019 మధ్య చేసిన పాదయాత్ర, ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన చర్యలపై తెరకెక్కినట్టు తెలుస్తోంది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో వైఎస్ జగన్కు ఉన్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను ఈ చిత్రంలో ఎమోషనల్గా చూపించనున్నారు దర్శకుడు మహీ వీ రాఘవ్. దీంతో.. పవన్ కల్యాణ్, లోకేశ్, షర్మిళ పాత్రలను ఈ మూవీలో చూపించడం ముఖ్యం కాదని అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తావన మాత్రం ఉండొచ్చు. మూవీ రిలీజ్ అయ్యాక ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది.
వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీలో మమ్మూట్టి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అయితే, యాత్ర 2లో ఆయన పాత్ర కాసేపు మాత్రమే ఉండనుంది. జగన్ పాదయాత్రనే ప్రధానంగా ఉండనుంది.
యాత్ర 2 మూవీలో వైఎస్ జగన్ పాత్రలో జీవా చేశారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, చంద్రబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్, సోనియా గాంధీగా సుసాన్నే బెన్నెట్ నటించారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ ఆసక్తికరంగా సాగింది.
2019 ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర మూవీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మేలు చేసిందని భావిస్తారు. ఆ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు రానున్న యాత్ర 2 కూడా ఆ పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాత్ర 2 చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కానుంది. వీ సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్లపై శివ మేకల, మహి వీ రాఘవ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.