Virat Kohli: కోహ్లీపై పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.. ‘ఉండాలంటే ఆడాల్సిందే’
13 August 2022, 19:06 IST
- టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా స్పందించాడు. టీ20 వరల్డ్ కప్లో ఉండాలంటే అతడు ఆసియా కప్ లో తప్పకుండా రాణించాల్సిందేనని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి గత కొంతకాలంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే విరాట్ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తుంది. అది అటుంచితే నిలకడ లేమితో తక్కువ పరుగులకే ఔట్ కావడం టీమ్పై భారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోహ్లీ ఫామ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు ఉండాలంటే ఆసియా కప్లో తప్పకుండా రాణించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
"విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ పుంజుకుంటే అద్భుతమైన ఇన్నింగ్స్తో పునరాగమనం చేయాలని ప్రతి ఒక్కరూ భావస్తారు. కాబట్టి అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే తప్పకుండా ఆసియా కప్లో మెరుగ్గా రాణించాలి. లేకుంటే జట్టుకు కూడా అతడు భారమవుతాడు. కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అతడిని బెంచ్కే పరిమితం చేయడం ఎవరికైనా కష్టంగా ఉంటుంది." అని డానిష్ కనేరియా స్పష్టం చేశాడు.
"కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి కోహ్లీకి మంచి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి విరాట్కు పరిపూర్ణ మద్దతు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సమయంలో పాక్ కూడా కోహ్లీ ఫామ్ పుంజుకోలేడని భావిస్తోంది. ఎందుకంటే అతడు బ్యాట్ ఝుళిపిస్తే వారికి ప్రమాదకరం" అని డానిష్ కనేరియా స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ ఫామ్ లేక ఇబ్బంది పడటం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ స్టార్ బ్యాటర్ చివరగా 2019 నవంబరులో సెంచరీ చేశాడు. అంటే దాదాపు మూడేళ్ల నుంచి శతకం నమోదు చేయలేదు. ఇటీవల కాలంలో క్రీజులో ఎక్కువ సేపు నిలబడటానికి కూడా ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆసియా కప్లోనైనా రాణిస్తాడేమోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్లో భారత్ తన తొలి మ్యాచ్ను ఆగస్టు 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో ఆడనుంది.