Jawan vs Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ను దాటలేకపోయిన జవాన్
08 September 2023, 16:09 IST
- Jawan BO Day 1 vs Adipurush: ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో ఆదిపురుష్ చిత్రాన్ని జవాన్ దాటలేకపోయింది. దీంతో ఈ ఏడాది తొలి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఆదిపురుష్ రికార్డు అలానే ఉంది.
Jawan BO Day 1 vs Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ను దాటలేకపోయిన జవాన్
Jawan BO Day 1 vs Adipurush: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కమర్షియల్ మూవీ అదిరిపోవటంతో తొలి రోజు కలెక్షన్లు కూడా ఆ రేంజ్లోనే వచ్చాయి. గురువారం (సెప్టెంబర్ 7) రిలీజ్ అయిన జవాన్.. ఫస్ట్ డే ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లను సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు గ్రాస్ కలెక్షన్ల విషయంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని షారుఖ్ ‘జవాన్’ దాటలేకపోయింది. ఆ వివరాలివే..
జవాన్ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.125.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ ఎనలిస్టులు వెల్లడించారు. ఇందులో ఇండియాలోనే సుమారు రూ.87 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.136.84కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తొలిరోజు గ్రాస్ వసూళ్ల విషయంలో ఆదిపురుష్ను జవాన్ దాటలేకపోయింది.
2023లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రంగా ఆదిపురుష్ టాప్లో ఉంది. ఆ తర్వాత జవాన్ నిలిచింది. ఇక మూడోస్థానంలో ఈ ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ చిత్రం పఠాన్ (రూ.106 కోట్లు) ఉంది.
ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్ 16న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు భారీ కలెక్షన్లను సాధించింది. అయితే, నెగెటివ్ టాక్ రావటంతో క్రమంగా వసూళ్లు పడిపోయాయి. దీంతో సుమారు మొత్తంగా సుమారు రూ.450కోట్లను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఆదిపురుష్. మరోవైపు షారుఖ్ నటించిన పఠాన్ సినిమా ఈ ఏడాది సుమారు రూ.1,000కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. జవాన్ కూడా అదే రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా ఆల్ టైమ్ రికార్డు ఆర్ఆర్ఆర్ పేరిటే ఉంది.
కాగా, జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై షారుఖ్ భార్య గౌరిఖాన్ నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సాన్య మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ కీలకపాత్రలు చేశారు. దీపికా పదుకొణ్, సంజయ్దత్ క్యామియోస్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.