Boycott Maldives: మాల్దీవుల్లో షూటింగ్లను బహిష్కరించండి.. ఫిల్మ్ మేకర్స్కు సినీ ఫెడరేషన్ విజ్ఞప్తి
11 January 2024, 11:19 IST
FWICE Urges Boycott Maldives: ప్రస్తుతం బైకాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ విపరీతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాల్దీవులలో షూటింగ్స్ను బహిష్కరించాలని వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (FWICE) ఫిల్మ్ డైరెక్టర్స్ను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
మాల్దీవుల్లో షూటింగ్లను బహిష్కరించండి.. ఫిల్మ్ మేకర్స్కు సినీ ఫెడరేషన్ విజ్ఞప్తి
FWICE Urges Boycott Maldives: గత కొంతకాలంగా బైకాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ తారలు బైకాట్ మాల్దీవ్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాల్దీవ్స్లో టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించడం కాకుండా ఇండియాలోని లక్షద్వీప్ను సందర్శించాలంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు ఇండియాపై, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.
ఈ నేపథ్యంలోనే మాల్దీవ్స్ను బైకాట్ చేయాలంటూ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (FWICE/Federation Of Western India Cine Employees) తెలిపింది. మాల్దీవులలో సినిమా షూటింగ్లను బహిష్కరించాలని కోరుతూ నోట్ విడుదల చేసింది. మాల్దీవ్స్కు బదులు ఇండియాలోని ఇలాంటి ప్రదేశాలను షూటింగ్స్కు ఎంచుకోవాలని కోరింది. ఈ నిషేధంలో ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ యూనియన్ సభ్యులు చేరాలని విజ్ఞప్తి చేసింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇలా అధికారిక ప్రకటన చేసింది ఎఫ్డబ్ల్యూసీఈ. ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యలను అతిపెద్ద ఫెడరల్ బాడీ అయిన ఎఫ్డబ్ల్యూసీఈ, వినోదరంగం, మీడియా సంస్థల్లో పని చేసిన కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఎఫ్డబ్ల్యూసీఈ పేర్కొంది.
"మాల్దీవ్స్, భారత్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్కు సంఘీభావంగా మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. వాటికి బదులుగా భారత్లోని అలాంటి ప్రదేశాలను ఫిల్మ్ మేకర్స్, సభ్యులు షూటింగ్ కోసం ఎంచుకోవాలని, భారతదేశ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని ప్రకటనలో వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది.
"భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలందరూ మాల్దీవులలో ఎలాంటి షూటింగ్లు లేదా నిర్మాణ కార్యకలాపాలను ప్లాన్ చేయొద్దని ఈ ప్రకటనతో కోరుతున్నాం. మనమందరం మన ప్రధానమంత్రికి, దేశానికి బలమైన మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అన్నట్లుగా ఆ ప్రకటన సారాంశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ వివాదం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్కు వెళ్లినప్పుడు చేసిన పోస్ట్తో ప్రారంభమైంది. లక్ష్యద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ స్నార్కెలింగ్ గురించి ప్రస్తావించారు నరేంద్ర మోదీ. బీచ్లంటే ఇష్టముండేవారు ముందు లక్ష్యద్వీప్కు రావాలని ప్రధాని అన్నారు. కానీ, మాల్దీవులకు ప్రత్నమ్నాయంగా లక్ష్యద్వీప్కు రండి అని ప్రధాని మోదీ అన్నట్లుగా నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. ఇంతలో భారత్, ప్రధానమంత్రిపై మాల్దీవుల మంత్రులు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
"మోదీ ఒక క్లోన్. మోది ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ. లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు" అని మాల్దీవుల యూత్ ఎంపవర్ మెంట్ డిప్యూటి మినిస్టర్ షియూనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తలెత్తడంతో ఆమె ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. అలాగే "బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురవుతోంది. అది తట్టుకోలేకే మాల్దీవులను భారత్ అటాక్ చేస్తోంది" అని మరో మాల్దీవుల మంత్రి కామెంట్స్ చేశారు.
దీంతో బైకాట్ మాల్దీవ్స్ వివాదం మొదలైంది. దీనికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు నిలిచారు. లక్ష్యద్వీప్లోని ప్రదేశాల ఫొటోలను షేర్ చేస్తూ బైకాట్ మాల్దీవ్స్ను ట్రెండ్కు సహకరించారు. వారితోపాటు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తదిదర కథానాయికలు సైతం బైకాట్ మాల్దీవ్స్ అంటూ ప్రచారం చేశారు.