Chiranjeevi |చిరంజీవిని మోసం చేసిన నిర్మాతలు
01 May 2022, 10:13 IST
ఆచార్య చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరంజీవి. ఇందులో నక్సల్ నాయకుడిగా చిరంజీవి నటన అభిమానుల్ని మెప్పిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలుస్తున్న చిరంజీవి కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో తనతో కొందరు నిర్మాతలు విలన్ వేషాలు వేయించి మోసం చేశారని కెరీర్ ఆరంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి పేర్కొన్నారు.
చిరంజీవి
బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో రాణించడం సులభం కాదు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది వారసత్వంతో ఎదిగిన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా చిరంజీవి స్ఫూర్తితో ఆయన కుటుంబం నుంచే పది మందికి పైగా హీరోలు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఎంతో మంది నటులకు ప్రేరణగా నిలిచిన చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో తనను చాలా మంది నిర్మాతలు మోసం చేశారని కెరీర్ ఆరంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. హీరోగా అవకాశాలిస్తామంటూ చెప్పి తనతో విలన్ వేషాలు వేయించారని అన్నారు. కెరీర్ మొదట్లో ఒకవైపు హీరోగా నటిస్తూనే కొత్తల్లుడు, కొత్త పేటరౌడీ లాంటి చిత్రాల్లో చిరంజీవి విలన్గా నటించారు. తనను హీరోగా పెట్టి భారీ చిత్రాన్ని నిర్మిస్తామని సీనియర్ ఎన్టీఆర్తో అడవిరాముడు తీసిన నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు వాగ్ధానం చేయడంతో వారి మాటలపై నమ్మకంతోనే ఆ సినిమాల్లో విలన్గా నటించాల్సివచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు.
హీరో కావాలనే తనలో ఉన్న తపనను వాడుకుంటూ ఆ నిర్మాతలు మోసం చేశారని చిరంజీవి చెప్పారు. తనలోని భయాల్ని అసరాగా తీసుకొని వారితో పాటు ఎంతో మంది నిర్మాతలు పారితోషికం ఇవ్వకుండా తప్పించుకునేవారని, అయినా వారిని తాను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదని చిరంజీవి పేర్కొన్నారు. పెద్ద పాత్రలు చేసి కూడా వెయ్యి, రెండు వేలు మాత్రమే పారితోషికం అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న గాఢ్ ఫాదర్, భోళాశంకర్ తో పాటు బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఏడాదే విడుదలకానున్నాయి.
టాపిక్