Anupam Kher: రవితేజ సినిమాలో అనుపమ్.. కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు
03 August 2022, 8:49 IST
- బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో నుపురు సనన్ హీరోయిన్గా చేసింది. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అనుపమ్ ఖేర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ తెలుగు సినిమా చేయబోతున్నారు. ఆయన చేస్తున్న సినిమా ఎవరితోనూ కాదు.. మన మాస్ మహారాజా రవితేజతో అనుపమ్ ఓ చిత్రం చేయనున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఈ బాలీవుడ్ విలక్షణ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అభిషేక్ నిర్మించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో అనుపమ్ పోషించిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకే హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి అభిషేక్ నిర్మాణంలో రానున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో అనుపమ్ చేయడం విశేషం. ఈ సినిమాలో నటించడంపై అనుపమ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిదే అనే సినిమా నిర్మాణ వర్గాలు తెలిపాయి.
అనుపమ్ గెటప్ ఇందులో విభిన్నంగా ఉంటుందని, ఆయన పలికే సంభాషణలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా సెట్ వేశారట. సినిమాకు అనుపమ్ ప్రధాన బలమని చెబుతున్నారు.
స్టువర్ట్ పురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా 1970 నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతొంది. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
అనుపమ్ ఖేర్ ఈ సినిమాతో పాటు మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ-2లోనూ ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
టాపిక్