Bodhan Sugar Factory : మళ్లీ తెరపైకి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ-బీజేపీని గెలిపిస్తే తెరిపిస్తామన్న జేపీ నడ్డా
27 November 2023, 21:28 IST
- Bodhan Sugar Factory : ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని టచ్ చేయలేదు. కానీ బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
జేపీ నడ్డా
Bodhan Sugar Factory : నిజామాబాద్ జిల్లాలో మూతపడిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశం ప్రతిసారీ ఎన్నికల్లో అజెండాగా మారడం, ఆపై పట్టించుకోకపోవడం పరిపాటిగా మారుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆ అంశాన్ని బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రస్తావించలేదు. దీంతో ఎన్నికల నినాదం నుంచి దూరమయ్యిందని అంతా భావించారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. బీజేపీని ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం 2014లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. కానీ ఆచరణ సాధ్యం కాలేదు.
షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి అవసరమైన చెరుకు సాగు జిల్లాలో జరగడం లేదని, కాబట్టి ఫ్యాక్టరీ ప్రారంభించడం కుదరదని ఆ తరువాత ప్రకటించారు. తాజాగా బోధన్లో సోమవారం జరిగిన బహిరంగ బీజేపీ బహిరంగసభలో జేపీ నడ్డా మాట్లాడారు. బోధన్ లో బీజేపీని గెలిపించి.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే వెంటనే బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అని ఆరోపించారు.
"కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారింది. బీఆర్ఎస్ పార్టీ దోపిడీ, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్. బీఆర్ఎస్కు సమానంగా కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతిమయం. పంచభూతాలను తమ అవినీతికి మార్గంగా చేసుకున్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలి" అని జేపీ నడ్డా కోరారు. ఈ సభలో బీజేపీ బోధన్ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.