Personal Loans: తక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ కావాలా? ఈ జాబితా మీకోసమే
24 January 2024, 9:10 IST
Personal Loans: సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు ఇచ్చే కనీస వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 24 శాతం మధ్యలో ఉంటుంది.
పర్సనల్ లోన్లపై బ్యాంకుల వడ్డీ రేట్లు
ఊహించని ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పడు పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణాలు) అవసరమవుతాయి. మనలో చాలా మంది వ్యాపారం, కారు, గృహనిర్మాణం మరియు విద్య వంటి ఏ రకమైన రుణాన్ని పొందడానికైనా బ్యాంకులపై ఆధారపడతారు. ఈ కేటగిరీల పరిధిలోకి రాని ఇతర ఖర్చులకు మీకు డబ్బు అవసరం అయినప్పుడు వ్యక్తిగత రుణాలు అవసరం అవుతాయి.
ఉదాహరణకు వివాహం, లేదా అత్యవసర విదేశీ పర్యటనకు వెళ్లడం వంటి సందర్భాల్లో పర్సనల్ లోన్స్ అవసరమవుతాయి. అటువంటి తక్షణ నగదు అవసరాల కోసం, బ్యాంకు నుండి వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.
వ్యక్తిగత రుణాలు సాధారణంగా సురక్షితం కాదు. కానీ సెక్యూర్డ్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఇచ్చే బ్యాంకులు సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఉదాహరణకు, కరూర్ వైశ్యా బ్యాంక్ సెక్యూర్డ్ రుణాలపై సంవత్సరానికి 11 శాతం, అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్పై 13-14 శాతం వసూలు చేస్తుంది.
బ్యాంకులు సాధారణంగా వ్యక్తిగత రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అయితే అవి వసూలు చేసే రేటు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు, బ్యాంకుతో సంబంధం, ఏ యాజమాన్యంలో పనిచేస్తున్నారు (ఎమెన్సీ / ప్రభుత్వం / రక్షణ శాఖ మొదలైనవి) వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రధాన బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్లలో వెల్లడించిన అతి తక్కువ వడ్డీ రేట్లను ఇక్కడ మీరు చూడొచ్చు.
వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు వసూలు చేసే అతి తక్కువ వడ్డీ రేట్లు
ఐసిఐసిఐ బ్యాంక్: రెండవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 10.65 శాతం నుండి 16 శాతం వరకు వసూలు చేస్తుంది. అయితే, దాని ప్రాసెసింగ్ ఛార్జీలు 2.50 శాతం వరకు వర్తిస్తాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.5 నుండి 24 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 4,999.
ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ దరఖాస్తుదారులకు 12.30 నుండి 14.30 శాతం, ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు సంవత్సరానికి 11.30 నుండి 13.80 శాతం వరకు వసూలు చేస్తుంది. డిఫెన్స్ ఉద్యోగులకు ఏడాదికి 11.15 నుంచి 12.65 శాతం వరకు రాయితీపై వ్యక్తిగత రుణాలు అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు (బ్యాంకుతో సంబంధం ఉన్నవారు) సంవత్సరానికి 13.15 నుండి 16.75 శాతం వరకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 12.40 నుండి 16.75 శాతం వడ్డీ రేటుతో పర్సనల్ లోన్స్ అందిస్తోంది. మరోవైపు బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేని ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఏడాదికి 15.15 నుంచి 18.75 శాతం వడ్డీకి రుణాలు ఇస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ను బట్టి పీఎన్బీ వడ్డీ రేటు 13.75 శాతం నుంచి 17.25 శాతం మధ్య ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 12.75 శాతం నుండి 15.25 శాతం వరకు రాయితీ వడ్డీ రేటు లభిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ప్రైవేట్ రుణదాత తన వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి కనీసం 10.99 శాతం వసూలు చేస్తుంది. అయితే లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 3 శాతం వరకు పన్నుతో కలిపి ఉంటాయి.
యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంక్ తన వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 10.65 శాతం నుండి 22 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
(ఇవి బ్యాంకులు వసూలు చేసే కనీస రేట్లు. మూలం: బ్యాంక్ వెబ్ సైట్లు)
ఇండస్ ఇండ్ బ్యాంక్: ఇండస్ ఇండ్ బ్యాంక్ వ్యక్తిగత రుణంపై సంవత్సరానికి 10.49 శాతం నుండి వడ్డీ రేటు వసూలు చేస్తుంది. అయితే ప్రాసెసింగ్ ఛార్జీలు 3 శాతం వరకు ఉంటాయి. రుణ మొత్తం రూ. 30,000 నుంచి రూ.50 లక్షల వరకు ఉండవచ్చు.
కరూర్ వైశ్యా బ్యాంక్: సెక్యూర్డ్ లోన్పై వడ్డీ రేటు సంవత్సరానికి 11 శాతం, అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్లపై 13 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఈ రేట్లు 2023 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి.
యస్ బ్యాంక్: యస్ బ్యాంక్ సంవత్సరానికి 10.49 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేటును వసూలు చేస్తుంది. కాలపరిమితి 72 నెలల వరకు ఉంటుంది. రుణగ్రహీత పాక్షికంగా తిరిగి చెల్లించవచ్చు. 50 లక్షల వరకు రుణం పొందవచ్చు.