India post insurance policy: జస్ట్ 399 రూపాయల వార్షిక ప్రీమియంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా
05 July 2023, 14:04 IST
India post insurance policy: ఏటా రూ. 399 ల నామమాత్ర ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వ పోస్టల్ విభాగం కల్పిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
India post insurance policy: ప్రమాదాలు చెప్పిరావు. ప్రమాదంలో యజమాని ప్రాణాలు కోల్పోతే అతడు లేదా ఆమెపై ఆధారపడిన కుటుంబం పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, ప్రతీ వ్యక్తి ప్రమాద బీమా తీసుకోవడం మంచిది. అలాంటి ఒక ప్రమాద బీమా పాలసీని గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ పాలసీ (Group Accident Protection Insurance Policy) పేరుతో టాటా ఏఐజీ తో కలిసి ఇండియా పోస్ట్ తీసుకువచ్చింది.
రెండు ప్రీమియం ఆప్షన్లు
ఏటా రూ. 399 ల నామమాత్ర ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల ఈ ప్రమాద బీమా పొందవచ్చు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వ పోస్టల్ విభాగం కల్పిస్తోంది. ఈ ‘ఇండియా పోస్ట్ ()’ పాలసీలో రెండు ప్రీమియం ఆప్షన్లు ఉన్నాయి. అవి రూ. 299 ప్రీమియం ఆప్షన్ కాగా, మరొకటి రూ. 399 ల ప్రీమియం ఆప్షన్. ఈ ప్రీమియంను ప్రతీ సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు గానూ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి.
ప్రయోజనాలు ఇవే..
రూ. 299 ప్రీమియం ఆప్షన్ తో ఈ పాలసీ తీసుకుంటే లభించే ప్రయోజనాలు ఇవి..
- బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు అందుతాయి.
- ఒకవేళ ప్రమాదంలో గాయపడితే రూ. 60 వేలు ఆసుపత్రిలో చికిత్సకు (IPD), అనంతరం, రూ. 30 వేలు ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన తరువాత చికిత్సకు (OPD) అందజేస్తారు.
- ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పూర్తిగా కదల్లేని స్థితిలో పాలసీదారు ఉంటే కూడా అతడికి రూ. 10 లక్షలు అందజేస్తారు.
- ప్రమాదంలో పాలసీదారు చనిపోతే, అంత్యక్రియల కోసం వెంటనే రూ. 5 వేలు అందజేస్తారు. పాలసీదారు కుటుంబ సభ్యులు వేరే నగరంలో ఉంటే, వారికి ప్రయాణ ఖర్చులు అందిస్తారు.
- రూ. 399 ప్రీమియం ఆప్షన్ తో ఇదే పాలసీ తీసుకుంటే, పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, అదనంగా.. ప్రమాదంలో మృతి చెందిన పాలసీదారు ఇద్దరు పిల్లలకు విద్యాఖర్చుల నిమిత్తం రూ. 1 లక్ష చొప్పున అందజేస్తారు.