తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gautam Adani: గుజరాత్ కు ఆదానీ గ్రూప్ బిగ్ బొనాంజా; ఐదేళ్లలో 2 లక్షల కోట్ల పెట్టబడులు

Gautam Adani: గుజరాత్ కు ఆదానీ గ్రూప్ బిగ్ బొనాంజా; ఐదేళ్లలో 2 లక్షల కోట్ల పెట్టబడులు

HT Telugu Desk HT Telugu

10 January 2024, 14:20 IST

  • Vibrant Gujarat Global Summit: గుజరాత్ లోని గాంధీనగర్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PTI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Vibrant Gujarat Global Summit: వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్ లో రానున్న ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని గౌతమ్ ఆదానీ ప్రకటించారు.

లక్ష ఉద్యోగాలు

గుజరాత్ (Vibrant Gujarat Global Summit) లో వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ పెట్టుబడుల వల్ల లక్ష ఉద్యోగాలు లభిస్తాయి. అంతరిక్షం నుంచి కూడా కనిపించే గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మించేందుకు గుజరాత్ లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ బుధవారం ప్రకటించారు. గాంధీనగర్ లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10 ఎడిషన్ లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ మాట్లాడుతూ, ఈ పెట్టుబడులు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అన్నారు. గత సదస్సులో ప్రకటించిన రూ. 55,000 కోట్ల లో అదానీ గ్రూప్ ఇప్పటికే రూ.50,000 కోట్లను ఇన్వెస్ట్ చేసిందని అదానీ తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ పార్కు

ఆదానీ గ్రూప్ ఇప్పుడు కచ్ లో 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోందని, ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుందని అదానీ చెప్పారు. 2014 నుంచి భారత్ జీడీపీలో 185 శాతం వృద్ధిని, తలసరి ఆదాయంలో 165 శాతం వృద్ధిని సాధించిందని, భౌగోళిక రాజకీయ, కొరోనా సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ ఈ ఘనతను సాధించిందని కొనియాడారు.

కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ

మరోవైపు, రిలయన్స్ కూడా గుజరాత్ లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ హజీరాలో భారతదేశపు మొట్టమొదటి, ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే ఉంటుందని అంబానీ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రిలయన్స్ 150 బిలియన్ డాలర్లు (12 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టగా.. అందులో మూడింట ఒక వంతుకు పైగా ఒక్క గుజరాత్ లోనే పెట్టుబడులు పెట్టినట్లు అంబానీ వెల్లడించారు. హరిత వృద్ధిలో గుజరాత్ ను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు తమ సంస్థ దోహదం చేస్తుందని రిలయన్స్ అధిపతి తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్

గుజరాత్ లోని జామ్ నగర్ లో 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ను రిలయన్స్ నిర్మించడం ప్రారంభించిందని అంబానీ తెలిపారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో గ్రీన్ జాబ్స్ లభిస్తాయని, గ్రీన్ ప్రొడక్ట్స్, మెటీరియల్ ఉత్పత్తికి వీలవుతుందని, తద్వారా రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, 2024 ద్వితీయార్థంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ వివరించారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధనాల ద్వారా సగం ఇంధన అవసరాలను తీర్చాలన్న గుజరాత్ లక్ష్యానికి తాము సహకరిస్తామని చెప్పారు.

తదుపరి వ్యాసం