YV on Vijay Kumar: మైసూరు విజయ్ కుమార్ స్వామిజీ వచ్చింది రామోజీ కోసమేనన్న వైవీ సుబ్బారెడ్డి
18 April 2023, 14:19 IST
- YV on Vijay Kumar: మైసూరు నుంచి విజయ్ కుమార్ స్వామిజీ ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చింది తమ కోసం కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేరే పనుల కోసం రామోజీ రావు వియ్యంకుడి విమానంలో వచ్చిన స్వామిజీకి సిఎం అపాయింట్మెంట్ ఇప్పించినట్లు చెప్పారు.
నవయుగ విశ్వేశ్వరరావుతో విజయ్కుమార్ స్వామిజీ ఫోటోలు చూపుతున్న సుబ్బారెడ్డి
YV on Vijay Kumar: మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో విజయ్ కుమార్ స్వామిజీ విజయవాడ రావడంపై పత్రికల్లో వచ్చిన వార్తలను టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఖండించారు. ఏపీలో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోవాలా, జగన్ ఎప్పుడు సిఎం పదవి దిగిపోవాలా అని రేయింబవళ్లు కలలు కంటున్నారని ఆరోపించారు. విజయ్ కుమార్ స్వామిజీ అవినాష్ కేసులో లాబీయింగ్ కోసం వాడుతున్నారని ఆరోపించడాన్ని సుబ్బారెడ్డి తప్పు పట్టారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, కొన్ని పత్రికలు స్వామిజీలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చడమే ఈ కథనాల ముఖ్య ఉద్దేశమని, చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడమే వారి లక్ష్యమన్నారు.
విజయవాడ విజయ్కుమార్ స్వామిజీ ఎవరి విమానంలో వచ్చారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. నవయుగ విశ్వేశ్వరరావుకు చెందిన విమానంలో విశ్వేశ్వరరావు కుమారుడు శశిధర్తో కలిసి స్వామిజీ విజయవాడ వచ్చారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రామోజీ రావు వియ్యంకుడి విమానంలో వచ్చిన స్వామిజీ ఎవరి కోసం వచ్చారో తెలియాల్సి ఉందన్నారు.
2007 నుంచి తనకు విజయ్కుమార్ స్వామిజీ పరిచయం ఉందని, చాలామంది ప్రముఖులతో స్వామిజీకి పరిచయాలు ఉన్నాయని సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్య మంత్రికి ఆయన ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతోనే ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గతంలో స్వరూపానంద స్వామిజీ, చిన్న జీయర్ , మంత్రాలయం రాఘవేంద్ర మఠం నుంచి, శ్రీశైలం దేవస్థానం, ఇంద్రకీలాద్రి నుంచి కూడా పండితులు వచ్చి సిఎంను ఆశీర్వదించారని గుర్తు చేశారు. విజయ్ కుమార్ స్వామిజీ విజయవాడ వస్తున్నారని తెలిసి, తాను రిక్వెస్ట్ చేసి సిఎంతో భేటీ ఏర్పాటు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. విజయ్కుమార్ స్వామిజీ వచ్చింది రామోజీ బంధువులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడకు వచ్చారన్నారు.
వ్యక్తిగత కార్యక్రమాలతో విజయ్కుమార్ స్వామిజీ విజయవాడ వస్తే తాను సిఎంతో భేటీ ఏర్పాటు చేశానని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మార్గదర్శి కేసుల నుంచి బయటపడటానికి స్వామిజీని తీసుకొచ్చారా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తనకు స్వామిజీల ఆశీస్సుల మీద నమ్మకంతోనే ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
స్వామిజీని తాము విజయవాడ తీసుకురాలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వారు ఏ ఉద్దేశాలతో స్వామిజీని విజయవాడ తీసుకువచ్చారో తనకు తెలియదన్నారు. రామోజీరావు బంధువుల ఇంట్లో గృహప్రవేశానికి కూడా విజయ్ కుమార్ స్వామిజీ వచ్చారని చెప్పారు. ఎవరి అవసరాల కోసం వారు ప్రత్యేక విమానాల్లో తీసుకు వచ్చి ఉండొచ్చన్నారు. తనకు వ్యక్తిగతంగా నమ్మకం ఉండటంతోనే స్వామిజీతో సిఎంకు భేటీ ఏర్పాటు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.
మైసూరులో ఉండే విజయ్ కుమార్ స్వామి గురించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, స్వామిజీలు, దేవుళ్ల విషయంలో రాజకీయ లబ్ది కోసం దుష్ప్రచారం చేయొద్దని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. చట్టం తన పని చేసుకుని వెళ్లాలని, మీడియాలో వచ్చే కథనాలకు అనుగుణంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోందని సుబ్బారెడ్డి ఆరోపించారు.
పక్షపాత ధోరణిలో సిబిఐ దర్యాప్తు జరుగుతుందని, అవినాష్ రెడ్డి బయట పెట్టిన విషయాల ఆధారంగా దర్యాప్తు సాగడం లేదని సుబ్బారెడ్డి ఆరోపించారు. సిబిఐను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. వివేకా బతికుండగా రెండో పెళ్లి గురించి తమకు తెలియదని, హత్య తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఫ్యామిలీ విషయాలను బయట పెట్టుకుని, కుటుంబ పరువును బయట పెట్టుకోలేక వాటి గురించి అప్పట్లో మాట్లాడలేదన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
ఎవరీ విజయ్ కుమార్….?
Chinta Sashidhar: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడంతో నష్ట నివారణ కోసం పొలిటికల్ ఫిక్సర్లు రంగంలోకి దిగారని విస్తృత ప్రచారం జరుగుతోంది. మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం కర్ణాటకకు చెందిన జ్యోతిష్యుడు, గ్రానైట్ వ్యాపారి విజయవాడకు వచ్చారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒక సంస్థలో భాగస్వామి పేరు తెరపైకి వచ్చింది. మైసూరు నుంచి హై ప్రొఫైల్ లాబీయిస్ట్ను విజయవాడకు తీసుకురావడంతో నవయుగ సంస్థకు చెందిన చింతా శశిధర్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
చింతా శశిధర్ ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన తండ్రి విశ్వేశ్వరరావుకు చెందిన నిర్మాణ సంస్థ పోలవరం నిర్మాణ పనులు చేపట్టింది. గతంలో కృష్ణపట్నం పోర్టును కూడా ఈ సంస్థ నిర్మించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కృష్ణ పట్నం పోర్టు లావాదేవీలలో తలెత్తిన విభేదాలతో రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులతో విభేదాలు తలెత్తినట్లు ప్రచారం ఉంది.
ఈ క్రమంలోనే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ నుంచి పోలవరం నిర్మాణ పనులు చింత కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ దక్కించుకుంది. దాదాపు మూడున్నరేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత దాదాపు ఆర్నెల్లకు పైగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అనూహ్యం పోలవరం నిర్మాణ బాధ్యతల్లోకి కొత్త సంస్థకు అప్పగించారు. గతంలో జరిగిన వ్యాపార లావాదేవీల్లో విభేదాల కారణంగానే కాంట్రాక్టు సంస్థను మార్చారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
మరోవైపు చింత కుటుంబంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో చింత శశిధర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవయుగ విశ్వేశ్వరరావుకు చిన్న కుమారుడైన చింతా శశిధర్ నాటకీయ పరిణామాల మధ్య 2021లో రామాయపట్నం నిర్మాణ పనులు నవయుగ సంస్థకు దక్కాయి.
2004-09 మధ్య కాలంలో వైఎస్తో సన్నిహితంగా నవయుగ సంస్థ ఆ తర్వాత వైఎస్ జగన్కు దూరమైంది. 2019లో పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించిన తర్వాత శశిధర్, జగన్ ఎలా దగ్గరయ్యారనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చగా మారింది. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూపు వశమవ్వడంపై కూడా చర్చ జరుగుతోంది.
తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, సంక్షోభ నివారణ క్రమంలో చింత శశిధర్ పేరు తెరపైకి వచ్చింది. మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో విజయ్కుమార్ను విజయవాడ తీసుకువచ్చి ఆ తర్వాత అదే విమానంలో హైదరాబాద్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ స్వామిజీని తాము విజయవాడ తీసుకురాలేదని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.