AP Liquor Case : మద్యం కేసులో చంద్రబాబుకు ఊరట, తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశాలు
27 November 2023, 15:43 IST
- AP Liquor Case : మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రకు ఊరట లభించింది. ఈ కేసులో తుది తీర్పు ఇచ్చే వరకు చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
లిక్కర్ కేసు
AP Liquor Case : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. అయితే మద్యం కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. వాదనలు ముగియడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సోమవారం చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు అందించారు. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు చంద్రబాబు, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయవద్దని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు సీఐడీకి స్పష్టం చేసింది.
మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు
మద్యం కేసులో ఈనెల 23న విచారణ జరగగా...చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మద్యం షాపుల లైసెన్స్దారులకు 2015-17 మధ్య ప్రివిలేజ్ ఫీజు విధింపు నిబంధన తొలగింపు ప్రతిపాదించిన ఫైల్ అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్ శాఖ మంత్రి, కమిషనర్ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫైలును ఆర్థికశాఖకు పంపకపోవడాన్ని సీఐడీ తప్పుపట్టడం సరికాదన్నారు. సీఐడీ దురుద్దేశపూర్వకంగా అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయాలని కేసు పెట్టిందని వాదనలు వినిపించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగాలతో చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్పై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు విచారణ
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇటీవల రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దుచేయాలని కోరుతూ ఈ నెల 21న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర శర్మ నేతృత్వంలో ఈ పిటిషన్ లిస్ట్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారని సీఐడీ అభియోగించింది. అయితే ఇందుకు సంబంధించి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ జారీ చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.