AP CID On Social Media : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఆస్తుల జప్తు- ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
08 November 2023, 22:11 IST
- AP CID On Social Media : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. విదేశాల నుంచి పోస్టులు పెట్టినా ఎంబసీ సాయంతో చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
AP CID On Social Media : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. సీఎం, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు నేతలు ఇలా ఎవరిపై అభ్యంతర పోస్టులు పెట్టినా వదలబోమన్నారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మారుపేర్లతో పోస్టులు పెడితే ఎవరికీ తెలియదని అనుకోవడం పొరపాటు అన్నారు. నకిలీ ఖాతాలను పట్టుకోలేమని భావిస్తున్నారని, ఫేక్ అకౌంట్స్ను నడిపే వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫేక్ అకౌంట్స్ ను ప్రోత్సహించే వారిపైనా చర్యలుంటాయన్నారు. హైకోర్టు జడ్జిలపై అనుచిత పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా చర్యలుంటాన్నారు.
ప్రతిపక్షాలపై పోస్టులను పరిశీలిస్తాం
ఇటీవల కాలంలో మంత్రులు, మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిని గుర్తించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో పెడుతున్న అనుచిత పోస్టులను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఎవరిపై అనుచిత పోస్టులు పెట్టినా సరే చూస్తూ ఊరుకోమన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తు్న్నారన్నారు. సోషల్ మీడియాను పాజిటివ్గా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. విదేశాల నుంచి పెట్టే పోస్టులపై ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా, యూకే వంటి దేశాలకు సీఐడీ బృందాలు పంపామన్నారు. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్ఓసీ చర్యలు తీసుకున్నామన్నారు. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అనుచిత పోస్టులు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సంజయ్ హెచ్చరించారు.
అనుచిత పోస్టులు పెడితే కేసులు
ఇటీవల జడ్జిలను దూషిస్తూ కొందరు పోస్టులు పెట్టారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. వైసీపీతో పాటు ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆస్తులు జప్తు చేయడానికి సైతం వెనకాడమన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంకర పోస్టులను తొలగిస్తున్నామన్నారు. ఇతర దేశాల నుంచి పెడుతున్న అసభ్యకర పోస్టులను గుర్తించి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టిన 19 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఇందులో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల రామ్ ఉన్నారని, వీరికి నోటీసులు ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్లు పెట్టిన 2972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. యువత అవసరంగా భవిష్యత్ పాడుచేసుకోవద్దని సూచించారు.