TTD Deepavali : అక్టోబర్ 24న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
17 October 2022, 11:31 IST
- TTD Deepavali తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి రోజు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని ప్రకటించారు.
దీపావళికి తిరుమలలో ఆస్థానం
TTD Deepavali తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వ భూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు….
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 24న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.
అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం..
సూర్యగ్రహణం రోజు 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తారు. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ ఉండదని ప్రకటించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇతర ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
నవంబరు 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారని ప్రకటించారు.
సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరని తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
టాపిక్