Balaji Cancer hospital: తిరుపతి స్విమ్స్ ఆవరణలో క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన
25 May 2023, 18:31 IST
- Balaji Cancer hospital:శ్రీ బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఏ ఒక్కరూ క్యాన్సర్ వ్యాధితో భాధ పడకూడదనే సంకల్పంతో స్విమ్స్ ఆవరణలో అంకాలజీ విభాగాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
శంకుస్థాపన చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి
Balaji Cancer hospital: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ.. శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆవరణంలో శ్రీ బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆంకాలజి భవనానికి టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలతో రూ. 124 కోట్ల వ్యయంతో శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు.
అంకాలజీ విభాగంలో కీలకమైన బంకర్ బ్లాక్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ భవనంలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, భవన నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు.
ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్ ద్వారా తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల నలుమూలల గ్రామాలలో పింక్ బస్ ద్వారా స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ను నిర్ధారిస్తున్నారని, ఇదే స్పూర్తితో ప్రతి జిల్లాకు పింక్ బస్ను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారని తెలియజేశారు.
త్వరలో మరో రెండు పింక్ బస్సులు టిటిడి ఆధ్వర్యంలో వస్తున్నాయని పేర్కొన్నారు. మొత్తం 400 బెడ్స్ సామర్ధ్యంతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 3 అంతస్థులు భవనంలో 3 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది.
ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు…
టీటీడీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సామాజిక మాద్యమాలపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదవ తరగతి పాసైన వారికి టీటీడీ లో లక్ష రూపాయల వరకు జీతం తో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న 8 సామాజిక మాధ్యమాలపై గురువారం టీటీడీ ఐటి జీఎం సందీప్ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాల చిరునామాలు ఐటి విభాగం గుర్తించింది. వీటి పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నిరుద్యోగులెవరు ఇలాంటి ప్రకటనలకు మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ www. tirumala.org ద్వారా ఇలాంటి విషయాలు ధృవీకరించు కోవాలనివిజ్ఞప్తి చేశారు.