Undavalli Petition: స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్ విచారణ డిసెంబర్ 13కు వాయిదా
29 November 2023, 11:56 IST
- Undavalli Petition: స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది.
ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
Undavalli Petition: స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ సిబిఐకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రతివాదులందరికి నోటీసులు అందలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 39మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరోవైపు సరైన చిరునామాలు లేకపోవడంతో కొందరు ప్రతివాదులకు కోర్టు నోటీసులు అందలేదని పిటిషనర్ వివరించారు. వ్యక్తిగతంగా పిటిషనర్లకు నోటీసులు అందించేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పిటిషనర్ కొత్త చిరునామాలతో కోర్టు నోటీసులను ప్రతివాదులకు అందించేందుకు అనుమతించిన హైకోర్టు కేసు విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
అసైన్డ్ భూముల కేసులో
అమరావతి అసైన్డ్ భూముల కేసులో హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల్లో మాజీ మంత్రి నారాయణ, అంజనీకుమార్ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. ఇరువర్గాలు సమయం కోరడంతో డిసెంబర్ 11కి విచారణ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో…
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశించింది.
ఓటుకు కోట్లు కేసులో…
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేవారు. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ వేశారు. తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ధర్మాసనం వాయిదా వేసింది.