Srisailam Project : కృష్ణమ్మకు భారీగా వరద - శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడంటే?
29 July 2023, 8:11 IST
- Krishna River Updates: కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జురాలకు 1.22 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్ట్లోకి చేరే వరద కూడా క్రమంగా పెరుగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
Rains in Telugu States: కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణ, గోదావరి నదులు పొంగిపోర్లుతున్నాయి. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఎగువ నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.. గోదావరి బేసిన్తో పోలీస్తే మాత్రం.. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యింది. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీశైలానికి భారీ వరద…
కృష్ణా బేసిన్లోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందికి నీటిని వదిలేస్తున్నారు. దాదాపు లక్ష క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలశాయానికి కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు జలాశయ నీటిమట్టం 829.92 అడుగులు, నీటినిల్వ 48 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాలి. ఫలితంగా ఇప్పట్లో గేట్లు ఎత్తే పరిస్థితి మాత్రం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలం నిండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తనున్నారు. సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఇక కర్ణాటకలోని నారాయణపుర ఆనకట్టలోకి ఇన్ఫ్లో పెరగడంతో శుక్రవారం 20 గేట్లను ఎత్తివేసి 1,14,200 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేశారు. ఫలితంగా శ్రీశైలానికి మరింత వరద చేరే అవకాశం ఉంది.
54.30 అడుగులుగా నీటిమట్టం…
మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వరద కొనసాగుతోంది. 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. శుక్రవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… ఇవాళ వరద ప్రవాహం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ భాగాన నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 14.30 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా డెల్టా పంట కాల్వలకు 4వేల క్యూసెక్కులు నీటిని, సముద్రంలోకి 13.57 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటి మట్టం 54.30 అడుగులుగా ఉంది. 14,92,679 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం అమలులో ఉంది.