JC Prabhakar Reddy: అవసరమైతే అధికారుల కాళ్లు పట్టుకుంటా, తీరు మార్చుకోకపోతే ఇంటికొచ్చి కొడతారు- జేసీ ప్రభాకర్
02 May 2023, 15:06 IST
- JC Prabhakar Reddy : అధికారులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారపార్టీకి అధికారులు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడంలేదని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడితే... అవసరమైతే అధికారుల కాళ్లు పట్టుకుంటానని సమస్యలు పరిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అధికారులు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం శుద్ధ దండగ అని విమర్శించారు.
మున్సిపల్ ఛైర్మన్ హోదాలో రెండేళ్లలో వివిధ సమస్యలపై 16 కేజీల అర్జీలు సమర్పించానని, వాటిల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అర్జీలను తూకం వేసి అమ్మితే రూ. 750 వచ్చాయని సెటైర్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులను ప్రశ్నించేందుకు వెళ్తే నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు అధికారపార్టీకి తొత్తులు
"దేశంలో ఆడిట్ జరిగే మున్సిపాలిటీ తాడిపత్రి మాత్రమే. అధికారులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పెద్దపప్పూరులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులను తీసేసి పాలెగాళ్లను పెట్టండి. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషన్ ఆఫీసులో నాలుగు రోజులు నిరసన చేస్తే పట్టించుకోలేదు. అధికారులకు ఇంకెందుకు పదవులు. అధికారులు తీరు మార్చుకోవాలి. ప్రజలు గురించి ఆలోచించే పరిస్థితిలో ఆఫీసర్లు లేరు. వైసీపీ ఎమ్మెల్యేలపై చెప్పులు వేస్తున్నారు. రేపు అధికారులపై కూడా చెప్పులు వేసి పరిస్థితి వస్తుంది. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాను..’ అని జేసీ వ్యాఖ్యానించారు.
కలెక్టర్ కాళ్లు పట్టుకుంటా
రెండ్రోజుల్లో సమస్యలపై కలెక్టర్ స్పందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. లేకుంటే కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానన్నారు. ప్రజలు సమస్యలు తీర్చేందుకు అధికారులు ఉన్నారన్నారు. ప్రజల కోసం ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లాగా చెప్పులు వేయించుకునే పరిస్థితి తెచ్చుకోనన్నారు. గురువారం వచ్చి ప్రజాసమస్యలు తీర్చమని ఆర్జేడీ కాళ్లు పట్టుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టంచేశారు. సీఎం జగన్ కాన్వాయ్ ను ధర్మవరం ప్రజలు ఆపారని గుర్తుచేశారు.
ధర్మవరం ప్రజల భూములు తీసుకుని వారికి న్యాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో నాజీలను మించిన పాలన జరుగుతోందని విమర్శించారు. ఇసుక రీచ్ లలో అధికారులకు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. అధికారుల తీరుమార్చుకోకపోతే ప్రజలు... వాళ్ల ఇళ్లకు వెళ్లి కొడతారన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్ష కూడా చేశారు. మున్సిపల్ కార్యాలయంలో వంటావార్పు కార్యక్రమం చేసేందుకు ప్రయత్నించగా జేసీని పోలీసులు అడ్డుకున్నారు.