Know Your Electricity Bill: ఏపీ కరెంటు బిల్లుల వసూళ్ల లెక్కలివే.. అద్దె ఇళ్లపైనే అధిక భారం
16 August 2023, 9:37 IST
- Know Your Electricity Bill: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఒకటికి నాలుగైదు ఛార్జీలను జనం నుంచి ఇంధన సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కరెంటు బిల్లుల్లో అసలు ఛార్జీలతో పాటు సామాన్యులకు అర్థం కాని మరో మూడు వడ్డింపులు కూడా ఉంటున్నాయి.
ఏపీ విద్యుత్ వినియోగదారుల బిల్లు
Know Your Electricity Bill: ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలలుగా విద్యుత్ ఛార్జీల భారం అన్ని వర్గాల ప్రజలకు భారంగా మారింది. విద్యుత్ ఛార్జీల రూపంలో పెంపు భారం లేకపోయినా రకరకాల మార్గాల్లో వడ్డిస్తోంది. దీంతో జనం నడ్డి విరుగుతోంది. సగటున విద్యుత్ బిల్లుల్లో ప్రతి ఒక్కరికి కనీసం 25-30శాతం పెరుగుదల భారం ఉంటోంది. ఈ క్రమంలో బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయనేది ఓ పట్టాన అర్థం కావట్లేదు.
విద్యుత్ బిల్లుల వసూళ్ళలో ఇంధన ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటున్నాయి. వీటిలో మొదటిది స్థిర వినియోగ ఛార్జీలుగా పిలిచే ఫిక్స్డ్ చార్జీలు ఉన్నాయి. రెండోది విద్యుత్ సేవల్ని అందించినందుకు వినియోగదారుల నుంచి కస్టమర్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. మూడో ఛార్జీగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆ తర్వా త ఇంధన సర్దుబాటు (FPPCA charges) చార్జీలు (6/2021),1. ఇందన సర్దుబాటు (FPPCA charges) చార్జీలు (6/2023) ఉన్నాయి.
ఫిక్స్ డ్ చార్జీలు..
విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఇంటికి కరెంటు రావటానికి లైన్లు, సబ్ స్టేషన్లు , ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటి ఏర్పాటు కోసం చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్డ్ చార్జీలుగా పరిగణిస్తారు. ఇంటికి కనెక్షన్ తీసుకునేటప్పుడు 2 కేవీ, 4 కేవి, 5 కేవి లెక్కల్లో మన అవసరాన్ని బట్టి కనెక్షన్ తీసుకుంటాము.
ఒక కేవికి రు.10లు చొప్పున ఎన్ని కేవీ లోడు ఉంటే అన్ని 10లు వసూలు చేస్తున్నారు. ఇవి బిల్లుల్లో ఎప్పుడూ కొనసాగుతాయి. కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లు అంతకు మించి కాలం గడిచిన ప్రాంతాలలో కూడా ఇప్పటికీ ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు.
కస్టమర్ చార్జీలు….
ఇంటికి కరెంటు సప్లై చేసినందుకు వేసే చార్జీలను కస్టమర్ ఛార్జీలుగా పరిగణిస్తారు. నెలలో వాడుకునే యూనిట్ల శ్లాబును బట్టి రు25,రు.30,రు.45,రు.50,రు.55లు గా వీటిని వసూలు చేస్తున్నారు.
ఎలక్ట్రిసిటీ డ్యూటీ…
విద్యుత్ వాడుకున్నందుకు ప్రభుత్వానికి కట్టే పన్నును ఎలక్ట్రిసిటీ డ్యూటీగా పరిగణిస్తారు. యూనిట్ కు 6 పైసల చొప్పన దీన్ని వసూలు చేస్తున్నారు. షాపులకు అయితే యూనిట్కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు.
ట్రూ అప్ చార్జీలు…
2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్ పై రు.3,013 కోట్ల రూపాయలు ప్రజలనుండి 36 నెలల్లో వారి వాడకాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 13నెలలుగా వీటిని వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లులో True-Up Charges (13/36) పేరుతో ఆగష్టులో జారీ చేశారు. గతంలో 2014 నుండి 2019 వరకు వాడిన యూనిట్లకు యూనిట్ కు 0.22 పైసల చొప్పున ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఆగస్టు 2022 నుండి జులై 2025 వరకు వసూలు చేస్తారు. ఈ వసూలు పూర్తయ్యాక ఆతర్వాత 2019 నుండి 2021 వరకు ఏర్పడిన లోటును వసూలు చేస్తారు. 2014లో మీరు ఓ ఇంట్లో అద్దెకు లేకున్నా, అప్పట్లో విద్యుత్ వినియోగించిన వారి తరపున ఇప్పుడు మీరే కట్టాల్సి ఉంటుంది.
ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges)…
2021-2022 ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు బిల్లుల్లో వసూళ్ళకు ఉత్పత్తి సంస్థలకు ఏర్పడిన లోటుకు మధ్య వ్యత్యాసాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో (FPPCA charges (6/2021)) పేరుతో బిల్లులో ఉన్నాయి. 2021-22మధ్య కాలానికి మనం వాడిన కరెంటుకు యూనిట్కు ఏప్రిల్ నుండి జూన్ వరకు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జులైనుండి సెప్టెంబరు వరకు యూనిట్కు 0.63 పైసలు, అక్టోబర్ నుండి డిశంబరు వరకు యూనిట్కు 0.57 పైసలు, జనవరి నుండి మార్చి వరకు యూనిట్కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు. ఈ వసూళ్ళు అయిన అనంతరం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి తర్వాత వసూలు చేస్తారు.
ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges 06/23)
ప్రస్తుత ఆర్థిక సంవత్సం లో 2023-2024 తొలి నెలల్లో వాడిన కరెంటుకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్నారు. వాటినే ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges (6/2023 ) పేరుతో బిల్లులో ఉన్నాయి. ఇవి ఇక మీదట ప్రతి నెలా కొన సాగుతాయి. బిల్లుల వసూళ్లలో ప్రాంతాన్ని, కనెక్షన్ తీరును, గతంలో విద్యుత్ వినియోగం ఆధారంగా ప్రస్తుత బిల్లుల్లో వచ్చే మొత్తాలు మారుతున్నాయి. ఇకపై కూడా విద్యుత్ బిల్లుల్లో ఎంత వాడితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేసేలా విధివిధానాలు ఉన్నాయి.