Saireddy Logic: కూటమి ఏదైనా వైసీపీ మద్దతు కావాల్సిందే.. సాయిరెడ్డి కామెంట్
18 July 2023, 6:48 IST
- Saireddy Logic: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కూటములు ఏకమవుతున్న వేళ వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ కొత్త చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఏపీకి చెందిన వైసీపీ ఏ కూటమిలోను లేదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతు కావాలంటూ చేసిన ట్వీట్ సందేహాలు రేకెత్తిస్తోంది.
కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి వైసీపీ అవసరం అంటున్న సాయిరెడ్డి
Saireddy Logic: కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ, యూపీఏ కూటమలు ఏకమవుతున్న ఏపీలో అధికార పార్టీ ముఖ్య నాయకుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా దానికి వైసీపీ మద్దతు కావాలని పేర్కొన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం బీజేపీతో అవగాహనతో కలిసి ముందకు సాగుతోంది. అధికారికంగా రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా బీజేపీకి నమ్మకంగా ఉంటోంది.
సాయిరెడ్డి తాజా ట్వీట్తో అవసరానికి అనుగుణంగా తమ ప్రాధాన్యతలు మారుతాయని పరోక్షంగా చెప్పినట్టైంది. వచ్చే ఎన్నికల్లో ఏ కూటమికి బలం ఉంటే ఆ కూటమికి తమ మద్దతునిస్తామనేలా ఆయన ట్వీట్ను అన్వయించుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఈ తరహా ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే పక్షానికి తాము మద్దతిస్తామని చెప్పారు. అయితే 2019లో ఢిల్లీలో ఎవరు మద్దతు అవసరం లేకుండానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీని బీజేపి దక్కించుకుంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వైసీపీ అవసరం లేకపోయినా, రాజ్యసభలో ఆ పార్టీ మద్దతు బీజేపీకి ఉపయోగపడుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతోంది. నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వ మనుగడకు కేంద్రం కూడా తమ వంతు సహకారం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ ప్రాధాన్యతలను సాయిరెడ్డి బయట పెట్టడంతో సందేహాలు తలెత్తుతున్నాయి.
30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీఏ, 24 పార్టీలతో ప్రతిపక్షం.. బెంగుళూరులో సమావేశం అవుతోందని, అయితే ఈ సారి ఢిల్లీ వెళ్లే మార్గం ఏపీ మీదుగానే సాగుతుందని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం వైఎస్సార్సీపీ భాగస్వామ్యంతోనే సాధ్యమని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో మెజార్టీ ప్రజల మద్దతు వైసీపీకి ఉన్నాయని, ఇప్పటి వరకు జరిపిన ముందస్తు సర్వేలు అదే విషయం చెబుతున్నాయని, వాటిలో వైఎస్సార్సీపీ భారీ విజయం తథ్యమని ఖాయమైందని సాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కూడిన ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సీట్లు లభిస్తే ఆ కూటమికి అవసరమైతే వైసీపీ మద్దతు ఇస్తుందనే సంకేతాలను సాయిరెడ్డి ఇచ్చినట్టైంది. సాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎలా పరిగణిస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. వైసీపీతో బీజేపీకి అధికారికంగా ఎలాంటి పొత్తు లేదు కాబట్టి లైట్ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. తమను వైసీపీ ధిక్కరిస్తుందనే అభిప్రాయం బీజేపీ పెద్దలకు కలిగితేనే కథ మరోలా ఉండొచ్చు.
ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో ఉన్న బలం మళ్ళీ కొనసాగితే ఈ సారి కేంద్రంలో అధికార పక్షం ఏర్పాటులో ఖచ్చితంగా ఆ పార్టీ కీలకం అవుతుంది. 22 ఎంపీ స్థానాలతో ఉన్న వైసీపీ అన్ని స్థానాలను మళ్లీ గెలుచుకుంటుందని ధీమాతో ఉంది. ఆ నమ్మకంతోనే సాయిరెడ్డి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతు అవసరమని చెప్పినట్టు తెలుస్తోంది.