APSRTC MD: విజయవాడ బస్సు ప్రమాద మృతులకు పది లక్షల పరిహారం
06 November 2023, 11:04 IST
- APSRTC MD: విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో ఆర్టీసి మెట్రో లగ్జరీ బస్సు దూసుకెళ్లడంతో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షల పరిహారం ప్రకటించింది. ఆర్టీసీ తరపున రూ.5లక్షల పరిహారం చెల్లిస్తామని ఎండి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.
ఆర్టీసీ బస్టాండ్లో బస్సు బీభత్సం
APSRTC MD: ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సిఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.పదిలక్షల పరిహారం ప్రకటించారు. మరో వైపు విజయవాడ బస్టాండ్లో ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరపున ఐదు లక్షల పరిహారం చెల్లించనున్నట్లు ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు.
విజయవాడ నుంచి 24మంది ప్రయాణికులతో బయల్దేరుతుండగా ప్లాట్ఫామ్ మీదకు దూసుకు వచ్చిందని చెప్పారు. కుమారి అనే ప్రయాణికురాలితో పాటు బస్సు ముందు నిలబడి ఉన్న వీరయ్య అనే ఔట్ సోర్సింగ్ కండక్టర్ కమ్ బుకింగ్ క్లర్క్ స్పాట్ లో చనిపోయినట్లు చెప్పారు. మరో ఏడాదిన్నర చిన్నారి ఆస్పత్రిలో చనిపోయిందని తెలిపారు.
బస్సు బయల్దేరుతుండగా బారికేడ్లు దాటుకుని స్టాల్స్ వైపుకు దూసుకు వచ్చిందన్నారు. ప్రమాదం యాంత్రిక తప్పిదమా, మానవ తప్పిదమా అనేది తెలియాల్సి ఉందన్నారు. బ్రేక్ ఫెయిల్ అయ్యిందా, డ్రైవర్ పొరపాటు చేశాడా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రమాదం జరిగినపుడు బస్సు ఏ గేర్లో ఉందనేది తెలియాల్సి ఉందన్నారు.
ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి అయాన్ష్ కూడా ప్రాణాలు కోల్పోయిందని, మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఆర్టీసీ తరపున ఐదు లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. గాయపడిన బుకింగ్ క్లర్క్ సురేష్బాబు, సుకన్యలకు ఆర్టీసీ చికత్స అందిస్తుందని చెప్పారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పరిమిత వేగంలో ప్రయాణించాలనే నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ఆర్టీసీ ప్రాంగణాల్లో జీరో టోలరెన్స్ నిబంధన పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ ట్రాక్ లేదన్నారు. డ్రైవర్ అల్కహాల్ సేవించి లేడని స్పష్టం చేశారు. విధుల్లోకి వచ్చే ముందు అల్కహాల్ టెస్ట్ చేసిన తర్వాత బస్సులు అప్పగిస్తామన్నారు. కొద్ది రోజులుగా సిక్లో ఉండి ఇటీవల విధుల్లో చేరినట్లు గుర్తించామన్నారు.
ఆర్టీసీలో జరిగే ప్రతి ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని ఆర్టీసీ ఎండి చెప్పారు. బస్సు పూర్తి ఫిట్నెస్తో ఉందన్నారు. 24గంటల్లోనే ప్రమాదంపై నివేదిక వస్తుందని చెప్పారు. డ్రైవర్ ఫిట్నెస్ వచ్చాకే విధుల్లో చేరినట్టు చెప్పారు. బస్సు డ్రైవర్ల విషయంలో ఏ వయసు వారికి ఎలాంటి సర్వీసులు అప్పగించాలనే దానిపై ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
మృతులకు రాష్ట్ర ప్రభుత్వ పరిహారం…
విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు
ప్రభుత్వానిదే బాధ్యత..లోకేష్
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నాారా లోకేష్ అన్నారు. ప్రమాదానికి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని నాలుగున్నరేళ్లుగా ఆర్టీసి గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడం లేదన్నారు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాాలని కోరారు.