Rice Price Hike: బియ్యం ధరలకు రెక్కలు.. జనం జేబులకు చిల్లులు
07 December 2023, 7:15 IST
- Rice Price Hike: నిత్యావసరాల ధరలపై మిగ్జామ్ తుఫాను ప్రభావం పడింది. అసలే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న జనానికి మిగ్జామ్ మరో షాక్ ఇవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరుగనున్నాయి.
బియ్యం ధరల పెరుగుదలతో సామాన్యుల విలవిల
Rice Price Hike: తుఫాను తీరం దాటగానే నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న వ్యాపారులు, తుఫాను ప్రభావం అంచనాలు కూడా రాకముందే బియ్యం ధరలు పెంచేశారు.ధరలు పెంచుతున్నట్లు మిల్లర్ల నుంచి టోకు వ్యాపారులకు సమాచారం అందింది. ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కొరవడటంతో గత కొద్ది నెలలుగా బియ్యం ధరలు చుక్కల నంటుతున్నాయి.
గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. పులిమీద పుట్రలా తుఫాను దెబ్బకు పండిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు తుఫాను ప్రభావంతో బియ్యం ధరలు మరింత పెరుగనున్నాయి.
ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.56 వరకు ఉంటోంది. మిల్లర్ల నుంచి హెల్సేల్ వ్యాపారులకు వచ్చే బియ్యంపై కిలోకు రూ.3 నుంచి రూ.5 రుపాయల వరకు లాభం కలుపుకుని విక్రయిస్తుంటారు. మూడు నెలల క్రితం రూ.1250-1300 ఉన్న 26కేజీల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.1600కు చేరువలో ఉంది. కిలో బియ్యం ధర రూ.60కు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కనీస ధర రూ.1500 ఉంటుందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కాస్త తక్కువ రకం, కొత్త బియ్యం ధరలు కూడా 26కిలోల బస్తా రూ.1400కంటే తక్కువకు దొరికే అవకాశం ఉండదని చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో సరిపడా నిల్వలు మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. బియ్యం ధరలు భారీగా పెంచడం ద్వారా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం సేకరించే బియ్యం ధరలు, పౌర సరఫరాల ద్వారా అందించే బియ్యం ధర అన్ని ఖర్చులతో కలిపి రేషన్ కార్డుల ద్వారా లబ్దిదారుడికి చేరే సమయానికి రూ.39 ఖర్చు అవుతోంది. ఇందులో ధాన్యం సేకరణ ధరతో పాటు గన్నీ బ్యాగులు, రవాణాలు, రేషన్ దుకాణాల కమిషన్, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యంలో కేంద్రం వాటా కూడా ఉంటోంది.
మరోవైపు సాధారణ ప్రజలు కొనుగోలు చేసే బియ్యం ధరలపై మాత్రం ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. మిల్లర్లు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నా ప్రభుత్వం కొన్నేళ్లుగా నియంత్రణ చర్యలు మాత్రం గాలికొదిలేసింది. గతంలో ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో పంటల దిగుబడి తగ్గినా, రైతులు నష్టపోయినా వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా పౌరసరఫరాల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టేది. ఆకస్మిక దాడులతో కేసులు నమోదు చేసేది. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఆంక్షలు విధించేవారు. ఇటీవలి కాలంలో ఈ తరహా చర్యలు పూర్తిగా మాయం అయిపోయాయి. వ్యాపారులు సిండికేట్గా మారిపోవడం, వాటి మీద అధికార యంత్రాంగం నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో ధరల పెరుగుదల కొనసాగుతుందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.