Bharath Jodo yatra in Andhra: ఏపీలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
14 October 2022, 13:22 IST
- Bharath Jodo yatra in Andhra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. కర్ణాటకలో గత కొద్ది రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర శుక్రవారం అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ వద్ద ఏపీలో ప్రవేశించింది. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్లో వేలాది మంది రాహుల్కు స్వాగతం పలికారు.
అనంతపురంలో రాహుల్ పాదయాత్ర
Bharath Jodo yatra in Andhra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ఏపీలో అడుగుపెట్టింది. రాహుల్ యాత్ర పాక్షికంగానే ఏపీలో కొనసాగనుంది. అనంతపురం జిల్లా డీహీరేహాళ్లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది.
రాహుల్ పాదయాత్ర కర్ణాటక నుంచి శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా డీహీరేహాళ్ సరిహద్దుకు చేరింది. మండలంలోని లింగంపల్లి వద్ద రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం ఓబుళాపురం మీదుగా ఆయన బళ్లారికి బయల్దేరతారు. అనంతపురం జిల్లాలో 12 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించి. తర్వాత కర్ణాటకలోని బళ్లారిలోకి వెళ్తారు.
ఆంధ్రాలో నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకుని రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా డి హీరేహాళ్ మండలం కనుక్కుప్ప గ్రామం వద్దకు రాహుల్ గాంధీ భారత్ జొడో పాదయాత్ర చేరుకుంది. భారీ పోలీస్ బలగాలు నడుమ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో 12 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతున్నదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లా డీ. హిరేహాళ్ మండలం జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్, ఓబులాపురం, ఓబులాపురం చెక్ పోస్ట్ మీదుగా కర్ణాటకలోని బళ్లారి వరకు పాదయాత్ర సాగనుందని తెలిపారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర తిరిగి ఈ నెల 18న ఏపీలో ప్రవేశించనుంది. ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఏపీలో 95 కిలోమీటర్లు పర్యటించిన తర్వాత రాహుల్ యాత్ర కర్ణాటక మీదుగా కృష్ణానదిని దాటి తెలంగాణలో ప్రవేశిస్తుంది.