Srisailam Ghat Road Accident : కాసేపట్లో శ్రీశైలం క్షేత్రానికి, ఇంతలోనే ఘోరప్రమాదం - ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
06 May 2023, 15:03 IST
- Srisailam Ghat Road Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
Srisailam Ghat Road Accident : నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీశైలం శిఖరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల ఫారెస్ట్లోని ఘాట్ రోడ్ చిన్నారుట్ల దయ్యాల మలుపు వద్ద పర్యాటకులతో వెళ్తోన్న బస్సు అదుపు బోల్తా పడింది. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ గ్రామానికి చెందిన 20 మంది భక్తులు బస్సులో వెళ్తున్నారు. కాసేపట్లో శ్రీశైలం క్షేత్రానికి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డు ములుపులను అంచనా వేయకుండా అతి వేగంగా బస్సును నడపడం ప్రమాదానికి కారణంగా ప్రత్యక్షసాక్షులు తెలుపుతున్నారు.
10 మందికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో 10కి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది భక్తులు ఉన్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలోను చాలా సార్లు ప్రమాదాలు జరిగాయని తెలుస్తోంది. అయినా అధికారులు ఎటువంటి సూచికలు, భద్రతా చర్యలు చేపట్టలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో 100 అడుగుల పైగా ఉన్న లోయ ఉంది. అదృష్టవశాత్తు బస్తు లోయ ఘాట్ రోడ్డుపై బోల్తా పడిందని, లోయలో పడితే పర్యాటకులు ఎవ్వరూ బతికేవారు కారని భక్తులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సేఫ్టీ వాల్ ను ఢీకొట్టి ఆగిన బస్సు
ఘాట్ రోడ్డు సాధారంగా వంపులు తిరిగి ఉంటుంది. నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ మార్గాల్లో వాహనాలను చాకచక్యంగా నడపగలరు. ఈ బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డును అంచనా వేయలేకపోవడంతో... బస్సు డివైడర్ను ఢీ కొట్టి, సేఫ్టీ వాల్ ను తగిలి పక్కకు బోల్తా పడింది. పడిన చోటే బస్సు ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మరో రెండు అడుగులు ముందుకు బస్సు దూసుకెళ్తే పెను ప్రమాదం జరిగేదని భక్తులు అంటున్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఏఈఓ ఫణిదారు ప్రసాద్, శ్రీశైలం సీఐ, ఎస్ఐ పోలీసు సిబ్బందితో 108 అంబులెన్సులతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సు ప్రమాదంలో గాయపడిన భక్తులను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు సరైన సూచికలు ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.