Covid Deaths | కోవిడ్ చావుల వెనక అసలు నిజాలు.. ఇంతకీ ఎంత మంది చనిపోయారు?
09 April 2022, 19:41 IST
- దేశంలో లెక్కాపత్రాలు లేకుండా పోయిన కోవిడ్ చావుల వెనుక అసలు నిజాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మృతుల కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపుపై సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ దరఖాస్తులకు, ప్రభుత్వాలు వెల్లడించిన అధికారిక మరణాలకు మధ్య పొంతన లేకపోవడంతో కేంద్రం ప్రత్యేక తనిఖీలను మొదలు పెట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ చావుల్లో నిగ్గు తేల్చే పని ప్రారంభించింది. క్షేత్ర స్థాయిలో తనిఖీల కోసం ముగ్గురు సభ్యుల బృందం ఏపీ చేరుకుంది. మార్చి 24న కోవిడ్ మరణాలపై క్షేత్ర స్థాయి విచారణ జరిపేందుకు కేంద్రానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఏపీలో పర్యటిస్తోంది. ప్రభుత్వ సాయం అనర్హులకు అందుతుందనే సందేహంతో ఈ విచారణ చేపట్టారు. 2020 మార్చి తర్వాత దేశంలో పెద్ద ఎత్తున కోవిడ్ మరణాలు సంభవించాయి. అయితే వీటికి ఎలాంటి అధికారిక గణాంకాలు లేకుండా పోయయి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారికి సైతం కోవిడ్ కారణంగా మరణించినట్లు ధృవీకరణ పత్రాలు అందచేయలేదు. మరోవైపు అసాధారణ రీతిలో చావులు ఉన్నా., రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సాధారణ మరణాల జాబితాలో కలిపేశాయి. మరణాలకు వైద్య పరమైన ఇతర కారణాలను పేర్కొన్నారు తప్ప కోవిడ్ చావులుగా నిర్ధారించలేదు.
ఈ వివాదం సుప్రీం కోర్టును చేరడంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించడంతో రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఆ తర్వాత అనూహ్యం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అసలు సంగతి బయట పడింది. ఇప్పటి వరకు చెల్లింపులు జరిపిన వాటిలో 5 శాతం దరఖాస్తులనైన పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర., కేరళ, గుజరాత్, ఏపీలలో క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు జస్టిస్ ఎం.ఆర్ షా, బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సింగ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏపీలో పర్యటిస్తోంది.
మూడు రెట్లు అధికంగా మరణాలు....
ఆంధ్రప్రదేశ్లో అధికారిక లెక్కల ప్రకారం 14,730 మంది కోవిడ్ కారణంగా చనిపోతే ప్రభుత్వ పరిహారం కోసం 47వేలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటిలో 44వేల దరఖాస్తుల్ని అంగీకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2,400దరఖాస్తుల్ని తిరస్కరించినట్లు, 37వేల మందికి పరిహారం చెల్లించనట్లు కేంద్రానికి తెలిపింది. మరో 7వేల మందికి పరిహారం చెల్లింపు ప్రాసెస్ చేస్తున్నారు. జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తుల్ని పరిశీలించి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. క్షేత్ర స్థాయి పరిశీలనలో కేంద్ర బృందాలు వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేయనున్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎన్డిఎంఏ మార్గదర్శకాలు పాటించారో లేదో తేల్చనున్నారు. ఈ క్రమంలో జిల్లా కమిటీలు అమోదించిన, తిరస్కరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ క్రమంలో తప్పుడు పత్రాలు సమర్పించిన వారు, కోవిడ్ ధృవీకరణ విషయంలో అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఐసీఎంఆర్ సర్టిఫికెట్లను కూడా బృందం పరిశీలించనుంది. తప్పుడు క్లెయిమ్స్ చేసిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుకు సంబంధించి కోర్టుకు నివేదిక అందచేయాల్సిన నేపథ్యంలో కేంద్ర బృందాలకు రాష్ట్రాలు సహకరించాల్సి ఉంది. నిజానికి కోవిడ్ చావుల విషయంలో ఎలాంటి పత్రాలు లేకుండా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందనే వాదనలున్నాయి.
టాపిక్