Janasena Pawan Kalyan : పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తే మూల్యం చెల్లించక తప్పదు
13 February 2023, 6:44 IST
- Janasena Pawan Kalyan ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల్లా పనిచేసే అధికారులు మూల్యం చెల్లించక తప్పదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వైసీపీని గుడ్డిగా సమర్థిస్తున్న అధికారులు మనం ఏది విత్తితే అదే పండుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
సత్తెనపల్లిలో రైతు భరోసా సభలో పవన్ కళ్యాణ్
Janasena Pawan Kalyan ఏపీలో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న అధికారులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. మనం ఏది విత్తితే అదే పండుతుందనే సంగతి అలాంటి అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీని గుడ్డిగా సమర్థించే అధికారులను ప్రజలంతా గమనిస్తున్నారని పవన్ పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల గౌడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలన తీరుపై చేసిన వ్యాఖ్యలపైపవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ లో జస్టిస్ గోపాల గౌడ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోతోపాటు శ్రీ పవన్ కల్యాణ్ గారు తన స్పందనను తెలియచేశారు.
జస్టిస్ గోపాల గౌడ ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న వికృత పాలనపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రతి అధికారి తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిసున్న ప్రతి ప్రభుత్వ అధికారినీ ప్రజలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారని మరచిపోవద్దన్నారు. అటువంటి అధికారులు ఒకటి తెలుసుకోవాలి... కార్యాచరణ సంబంధాన్ని నిర్దేశించే సార్వజనీన న్యాయసూత్రం ‘కర్మ’. ఏది విత్తితే అదే పండుతుంది. కాబట్టి వైసీపీని గుడ్డిగా సమర్థిస్తున్న ప్రతి అధికారీ ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నానంటూ పరోక్షంగా హెచ్చరించారు.
క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తల జీవితాలకు భద్రత…
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తల జీవితాలకు భరోసా, భద్రతనిస్తుందని నాగబాబు చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కార్యకర్తలకు, కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపడుతోన్న అద్భుతమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వమన్నారు. క్రియాశీల కార్యకర్తలకు వ్యక్తిగత భీమా సదుపాయాన్ని జనసేన పార్టీ కల్పిస్తోంది.
జనసేన పార్టీపై మీకున్న అంకితభావం ఎంత గొప్పదో మీ భద్రత అంత కన్నా విలువైనదని చెప్పారు. కుటుంబ భరోసా కోసం మీరంతా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆహ్వానిస్తున్నానని చెప్పారు. గతంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరూ రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి ఇంకా రెండు వారాలు సమయం ఉందన్నారు.
కార్యకర్తల భద్రత గురించి, కార్యకర్త కుటుంబం భరోసా గురించి ఆలోచించిన దాఖలాలు రాజకీయ వ్యవస్థలోనే చాలా అరుదని నాగబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు, వీర మహిళలకు ఎలాంటి భద్రత ఇవ్వాలి, వారి కుటుంబాలకు ఏ విధమైన భరోసా ఇవ్వాలనే దాని గురించి ప్రధానంగా ఆలోచిస్తారన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం అనుసరించే ప్రతీ ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు.
టాపిక్