AP Independence Day: కోర్టు కేసులు కూడా అంటరానితనంలో భాగంగా వేస్తున్నవే.. సిఎం జగన్
15 August 2023, 9:58 IST
- AP Independence Day: అంటరానితనంపై నిరంతర పోరాటం కొనసాగుతుందని విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సిఎం జగన్మోహన్ రెడ్డి
AP Independence Day: రాష్ట్రంలో రూపుమార్చుకున్న అంటరానితం మీద నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 77వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన సిఎం జగన్ సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను ప్రదర్శించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు ముందు సిఎం స్టేడియం మొత్తం కలియ తిరిగారు.
స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాలను గుర్తు చేస్తూ జాతీయ జెండా ఎగురుతోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 140కోట్ల భారతీయుల గుండె అని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారతీయుల స్వేచ్ఛకు నిదర్శనమని కొనియాడారు. చెక్కు చెదరని సమైక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమన్నారు.
76ఏళ్ల క్రితం పూర్వీకుల త్యాగాల పునాదుల మీద దేశం సాధించిన స్వాతంత్య్రానికి జెండా ఊపిరిలూదుతోందని చెప్పారు. 76ఏళ్ల ప్రయాణంలో దేశంలో, రాష్ట్రంలో ఎంతో పురోగమించాయన్నారు. చెప్పడానికి కావాల్సిన అనేక ఉదాహరణలు ఉన్నాయని, వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో సుదీర్ఘ కాలంలో ప్రగతి సాధించినట్లు చెప్పారు. స్థూలంగా కనిపించే వేగాన్ని అందుకునే అవకాశం రాని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఏడు దశాబ్దాల ప్రయాణంలో వెనుకబడి ఉన్నాయన్నారు. వీరి అకాంక్షల్ని, అవసరాల్ని ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 50నెలలుగా ఏపీ ప్రభుత్వంగా అనేక మార్పులు చేశామన్నారు.
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంలో ఉన్నాయని, 76ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. పౌర సేవల్లో ఏమి కావాలన్నా రేషన్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఎక్కడెక్కడ ఉండే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మార్చి, ఇంటింటికి వెళ్లి వారికి అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇలా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రుపాయిలో 15పైసలు మాత్రమే అర్హులకు అందుతున్నాయనే పరిస్థితిలో సమూల మార్పులు తెచ్చినట్లు చెప్పారు. నాలుగేళ్లలలో 2.30లక్షల కోట్ల రుపాయలను నేరుగా లబ్దిదారులకు ఎలాంటి వివక్ష లేకుండా అందించామని చెప్పారు. 76ఏళ్లలో మరే ప్రభుత్వం అమలు చేయని మార్పును ఏపీలో తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి రుపాయి నేరుగా లబ్దిదారుడు సద్వినియోగం చేసుకునేలా వారికి అందించామన్నారు.
సంక్షేమ పథకాలన్నీ మహిళల ఖాతాలకు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పథకం అమల్లో కూడా సోషల్ఆడిట్ తప్పనిసరి చేయడంతో పాటు లబ్దిదారుల ఎంపికలో పూర్తి స్థాయి పారదర్శకత పాటిస్తూ స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వం చేయలేదన్నారు. మంత్రి మండలిలో 68శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చామని, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, నామినేటెడ్ పదవుల్లోలచల 50శాతం పదవులు ఇచ్చామని చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.
రాజధాని వికేంద్రీకరణ చేయబోతున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్ పునరుద్ఘాటించారు. రూపు మార్చుకున్న అంటరానితనం మీద నాలుగేళ్లలో యుద్దం ప్రకటించామన్నారు. అంటరానితనం నిర్మూలనకు అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.పేదలు తెలుగు మీడియంలోనే చదువుకోవాలని చెప్పడం కూడా అంటరానితనమే అన్నారు. పేదలకు అవకాశాలు దక్కనివ్వకుండా చేయడం, విద్యా, వైద్యం, ఇంటి స్థలాలు, ఆర్టీసి ప్రయాణాలు వంటి దక్కకుండా చేయడం కూడా అంటరానితనమే అన్నారు.
కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల స్థలాలు అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని అభిప్రాయపడ్డారు. రూపం మార్చుకున్న పెత్తందారి భావ జాలం మీద యుద్ధం చేస్తున్నామని, పథకాలను అడ్డుకోవడానికి చూస్తున్న వారు సాగిస్తున్న అంటరానితనంపై యుద్ధం చేస్తున్నామని ప్రకటించారు.