MLC Car Driver Murder Case: విచారణ సీబీఐకు అప్పగించాలంటూ గవర్నర్కు ఫిర్యాదు
10 June 2022, 7:58 IST
- కాకినాడలో సంచలనం సృష్టించిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మృతుడి తల్లి ఆరోపించింది. నిష్పాక్షిక విచారణ కోసం సిబిఐ విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
డ్రైవర్ను హత్య చేసిన కేసులో జైలు పాలైన ఎమ్మెల్సీ అనంతబాబు
ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో కాకినాడ పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కేసు దర్యాప్తును సిబిఐతో జరిపించాలని మృతుడి తల్లి నూకరత్నం గవర్నర్, డిజిపి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు విజ్ఞప్తి చేసింది. నిందితుడు ఎమ్మెల్సీ కావడంతో అతడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా సాగుతోందని ఆమె ఆరోపించింది. ప్రభుత్వ మెప్పు పొందేందుకు పోలీసులు చట్టవిరుద్ధం వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల అదుపు ఆజ్ఞలలో దర్యాప్తు సాగుతోందని ఆరోపించారు. కాకినాడ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, ఎమ్మెల్సీ అనంతబాబును హత్యానేరం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పోలీసుల శవపంచనామాలో మృతదేహంపై 15గాయాలు ఉంటే, పోస్టుమార్టంపై 27 గాయాలు ఉన్నట్లు గుర్తించారని, ఎమ్మెల్సీ ఒక్కడే కారులో తీసుకువెళ్లి ఇన్ని గాయాలు చేయడం అసాధ్యమని, జిల్లా ఎస్పీ ఎమ్మెల్సీ ఒక్కరే హత్య చేశారని అర్ధం వచ్చేలా మాట్లాడారని మృతుడి తల్లి ఆరోపించారు. 15రోజులుగా హత్య కేసులో మిగిలిన నిందితుల్ని గుర్తించలేకపోయారని, ఉన్నతాధికారుల ఒత్తిడితోనే దిగువ స్థాయి దర్యాప్తు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు.
హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న టవర్ లొకేషన్ పరిశీలించినా, ఎమ్మెల్యేతో ఎవరెవరు ఉన్నారో తెలిసిపోతుందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న భీమారావు నిందితుడికి గతంలో నేర చరిత్ర లేదని చెప్పారని, 2019వరకు ఎమ్మెల్సీపై రౌడీషీట్ ఉందని తెలిసినా తప్పు దారి పట్టించారన్నారు. నిందితుడి కులాన్ని కూడా దాచిపెట్టేందుకు దర్యాప్తు అధికారి ప్రయత్నించారని హతుడి తల్లి గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
టాపిక్