CM Jagan Foundations: ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన
07 December 2023, 9:18 IST
- CM Jagan Foundations: ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేస్తున్న సిఎం జగన్
CM Jagan Foundations: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంతో పాటు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దుర్గ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చి దిద్దేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ తెలిపింది. . దుర్గగుడిలో నాలుగంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నారు.దీంతో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
మరోవైపు తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో అవి పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లకు, ర్యాంపు నిర్మించి వినియోగంలోకి తీసుకురానున్నారు.
ఇంద్రకీలాద్రి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో సౌకర్యానలు మెరుగపరచనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పనులు జరుగనున్నాయి.
మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగనున్నాయి. మళ్లీ ఆలయంలో ఎలాంటి కూల్చి వేతలు ఉండవని ప్రకటించారు. అభివృద్ధి పనులు అయ్యాక పరిస్థితి బట్టి ఘాట్ రోడ్పై నిర్ణయం తీసుకోనున్నారు. శంకుస్థాపన తర్వాత 18 నెలల్లోపు పనులు పూర్తవుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
శంకుస్థాపనలు
57 కోట్లు రాష్ట్రప్రభుత్వ నిధులతో 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం , 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు.
121.05 కోట్లు దేవస్థాన నిధులతో
13 కోట్లతో కనకదుర్గా నగర్ నుంచి మహామండపం వరకూ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
15 కోట్లతో రాజగోపురం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం
23.50 కోట్లతో మహామండపానికి దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
7.75 కోట్లతో కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం
7.50 కోట్లతో కనకదుర్గానగర్ నుంచి మహామండపం వరకూ రాజమార్గం అభివృద్ధి
7 కోట్లతో కొండపైన పూజ మండపాల నిర్మాణం
18.30 కోట్లతో ప్రస్తుత మల్లిఖార్జున మహామండపాన్ని క్యూ కాంప్లెక్స్ గా మార్పు
19 కోట్లతో నూతన కేశఖండనశాల నిర్మాణం
10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ ప్రయోజన సౌకర్య సముదాయంగా మార్పు
5 కోట్లు దాత నిధులతో
5 కోట్లతో కొండపైన గ్రానైటు రాతి యాగశాల నిర్మాణం
33 కోట్లు దేవస్థానం-ప్రైవేట్ భాగస్వామ్యంతో
33 కోట్లతో కనకదుర్గానగర్ వద్ద మల్టిలెవల్ కారు పార్కింగ్ నిర్మాణం చేపడతారు.