Chittoor Tomato Farmer : నెల రోజుల్లో కోటీశ్వరుడైన చిత్తూరు రైతు, అంతా టమాటా దయ!
25 July 2023, 14:01 IST
- Chittoor Tomato Farmer : చిత్తూరు జిల్లా రైతన్న టమాటా సాగుతో నెలరోజుల్లో కోటీశ్వరుడయ్యాడు. చంద్రమౌళి అనే రైతు 22 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. జూన్, జులై నాటికి కోతకు రావడంతో రైతన్న పంట పండింది.
చిత్తూరు జిల్లా టమాటా రైతు
Chittoor Tomato Farmer : టమాటా పంట రైతన్నల ఇంట సిరులు కురిపిస్తోంది. మార్కెట్ లో టమాటా ధర కిలో రూ.150 నుంచి రూ.180 పలుకుతోంది. దీంతో టమాటా రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ రైతు మూడు కోట్ల విలువైన టమాటాలను పండించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా రైతు నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన చంద్రమౌళి, తన తమ్ముడు మురళి, తల్లి రాజమ్మతో కలిసి టమాటా పంట సాగు చేస్తున్నాడు. కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపుపల్లెలో 10 ఎకరాల్లో చంద్రమౌళి కుటుంబం టమాటా పంటను సాగు చేసింది. ఎప్పుడూ నష్టాలు మిగిల్చే టమాటా పంట.. ఈసారి చంద్రమౌళిని కోటీశ్వరుడిని చేసింది.
రూ.4 కోట్ల ఆదాయం
జూన్, జులై నాటికి పంట చేతికి రావడంతో రైతు చంద్రమౌళి.. కర్ణాటక కోలార్ మార్కెట్లో విక్రయించాడు. 15 కిలోల టమాటా బాక్స్ ధర రూ. 1000 నుంచి రూ.1500 మధ్య పలికింది. రైతు చంద్రమౌళి 40 వేల పెట్టెలను విక్రయించగా దాదాపు రూ. 4 కోట్లు ఆదాయం వచ్చింది. 22 ఎకరాల్లో టమాటా సాగుకు పెట్టుబడికి రూ.70 లక్షలు, కమీషన్ రూ. 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు ఖర్చు అయినట్లు చంద్రమౌళి తెలిపారు. సాగు ఖర్చులు పోగా రూ.3 కోట్ల మిగిలాయని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతన్న కూడా
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మొహమ్మద్ నగర్ కి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి అనే రైతు తన 8 ఎకరాల్లో టమాటా పంట వేశాడు. సరిగ్గా టమాట ధరలు వంద రూపాయలకు కేజీ దాటే సమయానికి జూన్ 15 కి మహాపాల్ రెడ్డి పంట చేతికి వచ్చింది. ఈ నెల రోజుల సమయంలోనే ఈ రైతు సుమారుగా కోటి 90 లక్షల రూపాయలు సంపాందించాడు. జూన్ 15 నుంచి మొదలుకొని ఇప్పటివరకు, మహిపాల్ రెడ్డి సుమారుగా 7,000 క్రేట్ల టమాటాలను పఠాన్ చెరువు, బోయిన్ పల్లి, షాపూర్ మార్కెట్ లో కొనుగోలు చేశారు. ఒక్కో క్రేట్ లో 25 కేజీల టమాటాలు ఉంటాయి. సుమారుగా ఒక క్రేట్ ప్రస్తుతం రూ.2,600 ధర పలుకుతుందని చెబుతున్నారు రైతు మహిపాల్ రెడ్డి. ఇంకా తన పంటలో సుమారుగా 5,000 క్రేట్ల టమాటాలు పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. ధర ఇలాగే ఉంటే వచ్చే నెలలో మరో కోటి కోటిన్నిర వరకు ఆదాయం రావొచ్చు అని అంటున్నారు. సుమారుగా 20 సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నానని చెప్పిన మహిపాల్ రెడ్డి... తన జీవిత కాలంలో ఒక్క నెలలోనే ఇంత డబ్బుని ఎప్పుడు చూడలేదు అని సంతోషం వ్యక్తం చేశారు.