CBN On TS Election Results : విర్రవీగితే ఏం జరిగిందో చూశాం కదా - తెలంగాణ ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
08 December 2023, 15:43 IST
- Chandrababu On TS Elections Results: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.విర్రవీగితే తెలంగాణలో ఏం జరిగిందో చూశాం కదా అంటూ కామెంట్స్ చేశారు.
టీటీడీ అధినేత చంద్రబాబు
Chandrababu On TS Elections 2023: తెలంగాణలో ఎదురులేదనుకున్న బీఆర్ఎస్ కు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. 64 సీట్లలో గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇప్పటికే పాలన షురూ అయింది. కీలకమైన నిర్ణయాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు…. ఏపీలోని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇదే సందర్భంలో తెలంగాణ ఫలితాలను ప్రస్తావించారు. అహంకారంతో వ్యవహరిస్తే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ బీఆర్ఎస్ గురించి పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందన్న ఆయన… తనను జైళ్లో పెట్టించిన భయం సీఎం జగన్ను వెంటాడుతోందన్నారు.
5 ఏళ్లుగా తాను ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు చంద్రబాబు. ఏ తప్పు చేయకున్నా తనను జైలులో పెట్టి క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా? గుంటూరులోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన….మిచాంగ్ తుపానుతో రైతులకు తీవ్ర నష్టం వచ్చిందన్నారు. చేతికి పంట వచ్చే సమయంలో తుపాను వచ్చి నష్టం మిగిల్చిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు లేకనే రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతోనే పొలాల్లోకి మురికి నీరు చేరిందని, ప్రభుత్వ అధికారులు ఎవరూ ఇంకా రాలేదని దుయ్యబట్టారు. తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో కాకుండా సీఎం ఎక్కడో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని, తుపాను వల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.50 వేలు నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు..