Bezawada Bhavani Deeksha: ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీలు
04 January 2024, 15:41 IST
- Bezawada Bhavani Deeksha: భవానీదీక్షాదారులతో బెజవాడ ఎరుపెక్కింది. ఎక్కడెక్కడి నుంచో కనకదుర్గ అమ్మవారి మీద భక్తితో మండల దీక్షలు చేపట్టిన భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు విజయవాడ వస్తున్నారు.
భవానీదీక్షదారులతో కిటకిటలాడుతున్న విజయవాడ
Bezawada Bhavani Deeksha: భవానీ దీక్షలు చేపట్టిన భక్తులతో బెజవాడ రోడ్లు ఎరుపెక్కాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు వస్త్రాలతో ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా భక్తులు బెజవాడ తరలి వస్తున్నారు. కార్తీక మాసంలో చేపట్టే భవానీ దీక్షలను మండలం పాటు భక్తి శ్రద్ధలతో చేపడతారు. అన్ని వయసుల్లో ఉన్న స్త్రీపురుషులు భవానీదీక్షలు చేపట్టే ఆనవాయితీ ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, చత్తీస్ఘడ్ ప్రాంతాల నుంచి సైతం వేలాది మంది భక్తులు విజయవాడకు తరలి వస్తుంటారు.
భవాణీ దీక్ష విరమణలు మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. విజయవాడకు చేరుకునే భక్తులు కాలినడకనే ఇంద్రకీలాద్రికి చేరుకునే ఆనవాయితీ ఉండటంతో నగరంలో రోడ్లపై భక్తులు కాలి నడక వెళ్లేందుకు వీలుగా ఆంక్షలు విధించారు. విజయవాడ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 7వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కొనసాగనుంది.
భవానీ దీక్షల విరమణ మొదటి రోజు ఉదయం 06 గంటల నుండి రాత్రి 11.30 వరకు సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడున్నర లక్షల లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు.
17600 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 16 వేల మంది పైగా భక్తులు అమ్మవారి అన్నప్రసాదం, ఉచిత ప్రసాదం ను స్వీకరించినట్టు అధికారులు తెలిపారు.
బుధవారం ఉదయం ఉ.06.30 గం.లకు హోమగుండములలో శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించి హోమగుండములను ప్రారంభించారు.
భవానీ దీక్షల విరమణ ప్రారంభం కావడంతో వేకువ నుంచి పాతబస్తీ కెనాల్ రోడ్డులో ఉన్న వినాయకుడి గుడి నుండి ప్రారంభమయ్యే క్యూలైన్లలో ఘాట్ రోడ్ మీదుగా కొండపైకి చేరుకొని, అమ్మవారిని దర్శనం తర్వాత శివాలయము మెట్ల మార్గం ద్వారా క్రిందకి చేరుకుని, హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసిన ఇరుముడి పాయింట్లు వద్ద భక్తులు ఇరుముడులు సమర్పిస్తున్నారు.
దీక్ష సమయంలో అమ్మవారికి మొక్కులుగా ఉన్న ముడుపులు, కానుకలు సమర్పించుకుంటున్నారు. గురువారం ఉదయం 01.30 నుండి అమ్మవారి దర్శనం ప్రారంభించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు భవానీ దీక్షల విరమణను పర్యవేక్షిస్తున్నారు. కేశఖండన శాల, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో ఉన్న ప్రసాదం కౌంటర్లను పరిశీలించి ఆలయ ఈవో కె ఎస్ రామరావు పరిశీలించారు.