Investments In AP : ఏపీకి పెట్టుబడులు.. దేశంలోనే నెంబర్ వన్
18 July 2022, 14:55 IST
- DPIIT Report : ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రొత్సహిస్తోంది. కొత్త పెట్టుబడులను ఆకర్శిస్తోంది. పెట్టుబడుల లెక్కల్లో ఏపీనే నెంబర్ వన్ గా ఉంది.
ఏపీలో పెట్టుబడులు
సీఎం జగన్ ప్రభుత్వం.. పెట్టుబడులను ఆకర్శిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడులను ప్రొత్సహిస్తోంది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం ( డీపీఐఐటీ ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రాష్ట్రంలో 15 పరిశ్రమలతో రూ.19,409 కోట్ల పెట్టుబడులు సాకారమైన విషయం తెలిసిందే. పరిశ్రమలలో నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, THK ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ ఉన్నాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 221 యూనిట్ల ద్వారా రూ.65,929 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం వీటిలో 29.4 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి.
అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా భావించే మహారాష్ట్రలో ఈ మూడు నెలల్లో అసలు పెట్టుబడి రూ.11,882 కోట్లు మాత్రమే. మిగతా రాష్ట్రాలన్నీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ మూడు నెలల్లోనే రాష్ట్రంలో రూ.4,939 కోట్ల విలువైన 15 యూనిట్లకు ఒప్పందాలు కుదిరాయి.
ఒకవైపు కొవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబర్ 2020 లో నిర్మాణం ప్రారంభించి.. 11 నెలల్లో పని పూర్తయిందని Novaair ప్రతినిధులు చెప్పారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు 250 టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత 27 నెలల్లో 104 కొత్త యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వాటి ద్వారా రూ. 39,599 కోట్లు వచ్చాయి. అలాగే, 12 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా మరో పెట్టుబడి రూ. 24,039 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సాహానికి, సంస్థలకు అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.
DPIIT ప్రకారం, ఏ కంపెనీ అయినా ఒక యూనిట్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత DPIITలో పారిశ్రామిక పారిశ్రామికవేత్త మెమోరాండం (IEM) పార్ట్-ఎని ఫైల్ చేయాలి. వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన వెంటనే ఆ కంపెనీలు IEM పార్ట్-బిని ఫైల్ చేస్తాయి. వీటి ఆధారంగా దేశంలోకి వచ్చిన పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం లెక్కిస్తుంది.