Hyderabad | కర్ణాటక మడికేరిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
బంధుమిత్రులంతా కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లారు. కానీ ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ముగ్గురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు.
సరదాగా విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా గడిపిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. జలపాతంలో దిగిన ముగ్గురు వ్యక్తులు.. ప్రాణాలు పొగొట్టుకున్నారు. వారు విగతజీవులుగా బయటకు రావడంతో మిగిలిన కుటుంబ సభ్యులంతా.. షాక్ కు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని అబ్బి జలపాతం దగ్గరలో జరిగింది.
హైదరాబాద్ కు చెందిన కుటుంబ సభ్యులు కర్ణాటకకు విహారయాత్రకు వెళ్లారు. మెత్తం 16 మంది బంధుమిత్రులు సంతోషంగా గడపాలనుకున్నారు. కుశాలానగర్లోని ప్రైవేట్ హోమ్స్టేలో బస చేశారు. తాజాగా కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతం దగ్గరకు వెళ్లారు. 16 మందిలో ముగ్గురు వ్యక్తులు సరదాగా నీటిలో దిగారు. ఇక వారు బయటకు విగతజీవులుగానే వచ్చారు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఘటనా సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. ఈ కారణంగా వారిని రక్షించడం అసాధ్యంగా మారింది.
చనిపోయినవారు.. శ్యామ్ (36), షాహీంద్ర (16), శ్రీ హర్ష (18)గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు. చాలాసేపు గాలించగా.. ముగ్గురి మృతదేహాలను దొరికాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పర్యాటక బృందం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తమతో వచ్చిన ముగ్గురు విగతజీవులుగా మారటంతో గుండెలవిసేలా ఏడ్చారు.
టాపిక్