Bharath JODO : రేపటి నుంచి భారత్‌ జోడో యాత్ర….-rahul gandhi bharath jodo yatra starts at kanyakumari ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharath Jodo : రేపటి నుంచి భారత్‌ జోడో యాత్ర….

Bharath JODO : రేపటి నుంచి భారత్‌ జోడో యాత్ర….

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 01:23 PM IST

రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్రతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే యాత్రలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు నాయకుల్ని ఎంపిక చేశారు.

భారత్ జోడో యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ (HT_PRINT)

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్రకు సర్వం సిద్ధమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవార ప్రారంభం కానుంది. చెన్నై సమీపంలో శ్రీ పెరంబూదురులోని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద తొలుేత రాహుల్ నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కన్యాకుమారిలోని కామరాజ నాడర్, మహాత్మగాంధీ సమాధులకు రాహుల్‌ నివాళి అర్పిస్తారు.

సాయంత్రం బీచ్‌ రోడ్డులో భారత్‌ జోడో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి రాహుల్‌ గాంధీ భారీ యాత్రకు శ్రీకారం చుట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మరోవైపు యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కన్యాకుమారి చేరుకున్నారు.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో పూర్వవైభవం వస్తుందని తెలంగాణ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. భారత్‌ చోడో అనేలా బీజేపీ పాలన సాగుతోందని, దానికి అడ్డుకట్ట వేసి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి యాత్ర ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

తెలంగాణ నుంచి ఎంపిక చేసిన ఆరుగురు కార్యకర్తలు రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొననున్నారు. రోజు ఉదయం ఏడు నుంచి 11గంటల వరకు , సాయంత్రం మూడు నుంచి ఏడు వరకు రోజుకు 25-26 కిలోమీటర్ల చొప్పున యాత్ర సాగనుంది. మొత్తం 120మంది కార్యకర్తలు రాహుల్‌తో పాటు యాత్ర ముగిసే వరకు కొనసాగుతారు. పార్టీలతో సంబంధం లేకుండా అయా రాష్ట్రాల్లో ఎవరైనా యాత్రలో పాల్గొన వచ్చని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 46వేలమంది యాత్రలో పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచినా వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారనే విమర్శల నేపథ్యంలో రాహుల్ యాత్ర పార్టీకి మేలు చేస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పేదల గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఉందని,బీజేపీ, టిఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజల్లో నిజమైన మద్దతు లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. . కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందని, రాహుల్ యాత్రను ప్రజల్లో బలంగా తీసుకువెళ్తామని చెబుతున్నారు.

IPL_Entry_Point