Animal Vaccine : ప్రపంచంలో ఇదే తొలిసారి.. డ్రోన్ల ద్వారా జంతువులకు వ్యాక్సిన్
Vaccine Through Drone : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. ప్రతిదీ అరచేతిలోకి వచ్చేస్తుంది. తాజాగా జంతువులకు ఇచ్చే వ్యాక్సిన్ కూడా డ్రోన్ల ద్వారా పంపిణీ చేయడం మెుదలైంది.
డ్రోన్ల(Drones) ద్వారా మనుషులకు మెడిసిన్(Medicine) పంపిణీ చేయడం ఇప్పటికే మెుదలైంది. అయితే జంతువులకు కూడా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడం తొలిసారిగా మెుదలైంది. అదికూడా హైదరాబాద్(Hyderabad)కు చెందిన కంపెనీ శ్రీకారం చుట్టింది. డ్రోన్లను ఉపయోగించి రిమోట్ హెల్త్ కేర్ సదుపాయాలకు మందులను రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న 'మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై' చొరవతో హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) తన తొలి డ్రోన్ విమానాన్ని విజయవంతంగా పంపింది. జంతువుల వ్యాక్సిన్(Animal Vaccine)లను రవాణా చేసింది. అరుణాచల్ప్రదేశ్(arunachal pradesh)లోని పాగ్లాంలో ఈ విజయాన్ని సాధించినట్టుగా ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ, భారత ప్రభుత్వం (GoI), వ్యవసాయం మరియు పశుసంవర్ధక శాఖ, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (GoAP) మరియు డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ఐఐఎల్ ఈ ఘనత సాధించింది. అరుణాచల్ ప్రదేశ్లో డ్రోన్ విమానం ద్వారా మెడిసిన్(Medicine) పంపింది.
ప్రపంచంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా జంతు వ్యాక్సిన్(Anima Vaccine)లను రవాణా చేసినట్లు ఐఐఎల్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీ ద్వారా క్లిష్ట ప్రాంతాలకు వేగంగా చేరుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా అనేక వ్యాధుల నుండి పశువులను రక్షించడానికి టీకాలను సకాలంలో అందించడంలో సహాయపడుతుందని ఐఐఎల్ ప్రకటించింది.
ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్ష్యమన్నారు. మరింత సాంకేతిక(Technology)తో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి తేజ్ టాకీ, భారత ప్రభుత్వ పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ సంయుక్త కార్యదర్శి ఉపమన్యు బసు, IIL నుండి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. భారతదేశం ఆసియాలో వ్యాక్సిన్ల అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలుస్తోంది. దీనిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) 1982లో ఏర్పాటు చేసింది.